Thursday, 15 December 2011

mallikarjuna jyotirlingamu in sri sailamu (andhra pradesh)

                                                   
                                                శ్రీ శైల  లింగం శిరసా నమామి..మల్లికార్జున రూపం మనసా స్మరామి..
                                                       శ్రీ శైల  స్థల వాసినీం  భగవతీం  శ్రీ మాతరం  భావయే..

    నమో శ్రీ శైల వాసా..భ్రమరాంబికా మనోహరా  హర హర మహాదేవా అనుకుంటూ శ్రీ శైల యాత్రకు గత 8
సంవత్స రాలుగా కుటుంబ సమేతంగా  ఆ శ్రీ శైల మల్లికార్జున స్వామిని  భ్రమరాంబికా అమ్మ వారిని సందర్సించుకొనే  భాగ్యం  ఆ పరమేశ్వరుని  దయ వలన మాకు కులుగుతూ  ఉంది. ఆ స్వామి చల్లని చూపులు మాయందు నిరంతరమూ నిలిచి ఉండాలని కోరుకుంటూ..శ్రీ శైల యాత్రా విశేషాలు చెప్పుకుందాము..ఎంత చెప్పినా
తక్కువే.. పూర్తిగా చెప్పటము సామాన్య మానవులకు సాధ్యం కాదేమో..అంతటి మహిమాన్విత క్షేత్రము శ్రీ శైలము.
కైలాసం లో పార్వతీ పరమేశ్వరులు కుటుంబ సమేతంగా కొలువు తీరి ఉండగా..పిల్లలిద్దరూ తల్లి దండ్రు లను మారాం
చేస్తూ మాలో తొలి పూజ ఎవరికి అని అడుగగా అంత మహేశ్వరుడు  మీలో ముందుగా ఎవరు మూడు లోకాలలోని
 పుణ్య తీర్ధాలలో స్నానం చేసి వస్తారో వారే తొలి పూజకు అర్హులు అని చెప్పగానే షణ్ముఖ స్వామి తన మయూర
వాహనం ఎక్కి రివ్వున బయలుదేరి వెళ్ళగా వినాయక స్వామి తన మూషిక వాహనం ఎక్కి వెళ్ళలేక తండ్రితో
జనకా..  మీకు సర్వం తెలిసీ ఇలాంటి పరీక్ష పెట్టటం భావ్యమా అని అడుగగా.. పుత్రా ఈ ప్రపంచం లో వేటికీ సరితూగలేని  దైవం ఎవరూ.. అని చిరునవ్వు చిందిస్తూ పుత్రుని వంక చూడగానే గణపతి స్వామికి వెంటనే ఏదో స్ఫురించినట్లు తల్లి దండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేయగానే.. అక్కడ షణ్ముఖ స్వామికి తను స్నానం చేయుటకు వెళ్తున్న
ప్రతి  సారీ అంతకు ముందే గణపతి స్వామి ఆ నదిలో స్నానం చేసి వస్తున్నట్లు కనిపిస్తూ ఉంది. కైలాసంలో
ఆది దంపతులు  గణేష్ స్వామికి  ఆధి పత్యమునొసగి సిద్ధి, బుద్ధి ల తో వివాహము చేసి ముదముతో యుండగా  త్రిలోక నదీ సంచారానికి వెళ్ళిన కుమారస్వామి అరుదెంచి విషయము గ్రహించి.. అలిగి  నల్లమల అడవులలో తపస్సుకై  వెడలగా  పుత్ర వాత్సల్యముతో  పుత్రుని వెతుకుతూ పార్వతీ దేవి శ్రీ శైలం రాగా భార్యా బిడ్డలున్న శ్రీగిరి
శిఖరము కడకు సిరులిచ్చే మల్లన్నే స్వయంగా తరలి  రాగా..దేవతలందరూ ఆ ఆది దంపతులను కీర్తిస్తూ మీరు
ఇక్కడే వెలసి మమ్ములను సదా కాపాడ వలసిందని  సదాశివుని  కోరగా అంత ఆ బోళాశంకరుడు దయార్ద్ర  హృదయుడై ఇక్కడే జ్యోతిర్లింగముగా  వెలసి భక్తుల  మొరలాలకిస్తున్నారు. పార్వతీ దేవి భ్రమరాంబికగా అయ్యవారి ప్రక్కనే  శక్తి పీఠము గా అవతరించిన  ప్రసిద్ధ పుణ్య క్షేత్రమే శ్రీ శైలము. దేశం నలుమూలల నుండి నిరంతరం భక్తులు
వస్తూనే ఉండడం తో ఎల్లప్పుడూ వరుసలలో భక్తులు క్రిక్కిరిసి ఉంటారు.  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము నందు కర్నూలు  జిల్లా  లో ఉన్న ఈ పుణ్య క్షేత్రం  ఎల్ల వేళలా  హర హర మహాదేవ  శంభో శంకరా అంటూ భక్తుల గొంతులతో మారు మ్రోగుతూ ఉంటుంది. పరమేశ్వరుని పవిత్ర జ్యోతిర్లింగము  అమ్మవారి  శక్తి పీఠము  రెండూ ఒకే చోట గల ఈ       దివ్య ధామం  అశేష  జన వాహిని తో , మాలధారణ  పొందిన భక్తులతో నిత్యం  కళ కళ లాడుతూ ఉంటుంది.
 మహా శివరాత్రికి, కార్తీక మాసంలో జన ప్రవాహము విపరీతంగా ఉండుటచే మిగిలిన రోజుల్లో వీలు చూసుకుని ,
 వెళ్ళి వస్తూ  ఉన్నాము. ఆగష్టు 4 రాత్రి గుంటూరు లో 10 : 30 కు బస్సు ఎక్కితే దోర్నాల వెళ్ళేసరికి తెల్లవారుఝాము 4 అవటంతో బస్సు అక్కడే నిలిపివేసి (అక్కడినుండి అడవి ప్రాంతం కావటంతో రాత్రి వేళల్లో ఎటువంటి వాహనములు వెళ్ళనివ్వరు.) ఉదయం 5 : 30 కు తిరుగు ప్రయాణం సాగింది. కిటికీ ప్రక్కనే కూర్చుని దట్టమైన నల్లమల అడవులను  చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది.  బస్సు ఒకోసారి కిందకు మళ్ళీ పైకి అలా వెళ్తుంటే  ఊయల ఊగినట్లు బలే బాగుంది. ఆ రూటంతా పెద్ద పెద్ద కొండలు తొలిచి రోడ్డు వేశారు. ఎత్తైన కొండ ఎక్కి వెళ్తుంటే ప్రక్కన చూస్తే ఎంత ఎత్తులో ఉన్నామో అనిపిస్తుంది.మొత్తానికి దోర్నాల నుండి శ్రీ శైలం వరకు బస్సు లో మేము చాలా హుషారుగా ఉంటాము. శ్రీ శైలం లో బస్సు దిగి సత్రం లో రూం తీసుకుని పాతాళగంగ లో స్నానానికి బయలుదేరాము. చాలా పెద్ద పెద్ద   మెట్లు ఉన్నాయి. ఎలా వేసారో ఇంత పెద్ద మెట్లు నాకు కొన్ని మెట్లు దిగేసరికే     కాళ్ళు నొప్పులు పుడుతుంటే మా బాబు చెయ్యి పట్టుకుని మెల్లగా తీసుకెళ్తున్నాడు. చూస్తుంటే చాలా దగ్గరే నీళ్ళు ఉన్నట్లు కనిపిస్తుంటుంది కానీ  చాలా మెట్లు ఉన్నాయి.అలా మెల్లగా దిగుతూ ఆ గంగమ్మ తల్లి దగ్గరికి చేరుకున్నాము. శ్రీ శైలం చాలా ఎత్తులో ఉంటుంది కదా   కృష్ణానది ప్రవహిస్తూ  ఇక్కడకు చేరుకొని చాలా లోతుగా   ప్రవహిస్తూ  పాతాళగంగ గా పిలువబడుతుంది. ఇందులో నీళ్ళు ఆకు పచ్చగా ఉంటాయి. ఆ పవిత్ర  గంగా భవానీ మాతకు నమస్కరించి  స్నానం చేసి ప్రక్కన ఉన్న గదులలోనికి వెళ్ళి పొడి బట్టలు కట్టుకుని వచ్చి మెట్లు ఎక్కే దారిలో  చాలా చిన్న చిన్న శివ లింగాలు, శివయ్య ఫోటోలు ఉండి వచ్చిన భక్తులు  పూజ చేసుకుని వెళ్తున్నారు.
మేము కూడా ఆ అర్ధనారీశ్వరునికి పూజ చేసుకుని గంగా భవానీ తల్లికి నమస్కరించుకుని  వచ్చిన దారినే   మెట్లు ఎక్కుతూ కొంత సేపటికి  మల్లికార్జున స్వామి దర్సనం కొరకు టికెట్ తీసుకుని వరుసలో నుంచున్నాము. వరుస
చాలా పొడవుగానే ఉంది. భక్తులు ఎల్లవేళలా ఆ శివయ్య దివ్య దర్సనం కొరకు వేచి ఉండడం లో ఆశ్చర్యమేముంది
అనుకుంటూ ఆ మహాదేవుని తలుచుకుంటూ అలనాటి రాజులు ఎందరో శ్రీ శైలం వచ్చి శివయ్యని సేవించుకున్నట్లు
శివాజీ, విజయనగర రాజులు  శ్రీ శైల క్షేత్రము నకు  అభేజ్యమైన ఎత్తైన ప్రాకారాలను, అపూర్వ శిల్ప కళా సంపదను
సమకూర్చి ఆ మహాదేవుని కృపకు పాత్రులైనట్లు, శివాజీ మహారాష్ట్ర నుంచి వచ్చి ఇక్కడే కొంతకాలం నివాసముండి
ఆ ఆదిదంపతులను సేవించి భ్రమరాంబికా అమ్మదయతో ఆ భవానీ మాత నుంచి దివ్య ఖడ్గము అందుకున్నట్లు గా
శ్రీ కృష్ణ దేవరాయలు శ్రీ శైలం కు వచ్చిన భక్తుల వసతికి  కట్టించిన ఎన్నో సత్రాలు, ఆ దేవ దేవునికి ఆయన ఎన్నో సేవలు  చేసి ఆ పరమే శ్వరుని కరుణా కటాక్షం పొందినట్లు చరిత్రలో మనం చదువుకున్నవి మదిలో మెదిలినాయి. గుడి చుట్టూ ఉన్నఆ ప్రాకారాలు, వాటిపైన శ్రీ శైల క్షేత్ర మహిమను, స్థల పురాణం తెలిపే చిత్రాలు చెక్కిన తీరు అద్భుతం. అవి చూస్తూ ఉండగా  వరుస  మెల్లగా  కదులుతూ మల్లన్న కు చేరువవుతూ ఉంటుంటే చెప్పలేని ఆనందం కలుగుతుంది  మా మది లో.  ఎత్తైన  గాలి గోపురం దాటి లోపలి కి అడుగుపెట్టాము. అక్కడ అతి పెద్ద నందీశ్వరుడు, ముందు శివ పార్వతుల చిన్న ప్రతిమలు ఉన్నాయి. భక్తులు తీసుకెళ్ళిన కొబ్బరికాయలు అక్కడే స్వామికి నివేదం చేసి ఇస్తున్నారు.స్వామికి  పూలు,కొబ్బరికాయలు ఇచ్చి,ముందుకు కదిలాము.  ఆ స్తంభాలు వాటిపైన చెక్కిన   అద్భుత  శిల్ప కళా నైపుణ్యం చూపరులను ఆశ్చర్యానందాలలో ముంచెత్తుతాయి. ఒక ప్రక్క  వృద్ధ మల్లికార్జున స్వామి గుడి కనిపిస్తుంది. ఇంకో వైపు మనోహర కుండం  అందులో ఎప్పుడూ నీరు నిలచి చాలా స్వచ్ఛంగా ఉంటుందంట. గుడి గోపురం పైన నాలుగు మూలలా నాలుగు మనోహరమైన నందీశ్వర ప్రతిమలు అవన్నీ చూస్తూ ఆ మల్లన్న స్వామిని చూడ బోతున్నామనే  ఆనందం లో అలసటే తెలీలేదు. తదుపరి మళ్ళీ వరుస జరుగుతూ సింహ ద్వారం దాటంగానే  అతి సుందరమైన చాలా పురాతనమైన నటరాజ స్వామి ప్రతిమ చూస్తుంటే హృదయం పులకించిపోయింది.మనసారా కళ్ళకు హత్తుకుని నమస్కరించుకుని  మెల్లగా  జగత్ పిత  మల్లికార్జున స్వామి దగ్గరకు వచ్చాము.  గర్భ గుడిలో మల్లన్న స్వామిని చూడగానే  తన్మయత్వం తో సాక్షాత్తు ఆ కైలాస నాధుడే కనుల ముందు సాక్షాత్కరించినట్లు మా హృదయం పులకించిపోయింది.  ఆ మహాదేవునికి  మనసారా ప్రణమిల్లి  తల మోటించుకుని  చేతులతో తడుముకుని కళ్ళకద్దుకుని నమస్కరించుకుని  రాలేక రాలేక అక్కడినుంచి వస్తూ  పాండవులు   ప్రతిష్ఠించినట్లు  చెప్పబడిన అయిదు శివలింగాలు చూసి నమస్కరించుకుని ఇంకొంచెం  ముందుకు వెళితే వీరభద్ర  స్వామి గుడి.  ఆ స్వామికి నమస్కరించుకుని  వస్తూ తీర్ధం, ప్రసాదం  తీసుకుని  నేరుగా అమ్మ వారి దగ్గరకు వెళ్ళాము.దారిలో సహస్ర లింగేశ్వర స్వామి, ప్రక్కన అమ్మవారు ఉన్నచోట పూలు,కొబ్బరికాయలు ఇచ్చి ఆ తల్లి దగ్గరకు చేరుకున్నాము.   అమ్మలగన్నయమ్మ  ఆదిపరాశక్తి  భ్రమరాంబికా దేవి ప్రసన్నవదనంతో మనోహరంగా చిరునవ్వులు చిందిస్తూ  అభయహస్తంతో భక్తులను ఆశీర్వదిస్తున్నట్లుంది. చూడగానే  హృదయం భక్తి భావనతో  ఉప్పొంగి  అమ్మకు శిరసు వంచి చేతులుజోడించి నమస్కరించి వెలుపలికి వస్తూ వాకిలి దగ్గర ప్రసాదం తీసుకుని రూం కి వస్తూ ఉంటే దారిలో ఇష్టకామేశ్వరీ  అమ్మవారి దగ్గరకు వెళ్ళే వాన్ లు ఆగి ఉన్నాయి. మేము వెళ్ళి వివరాలు కనుక్కుని అప్పటికి మధ్యాహ్నం 12 దాటటంతో సాయంత్రం వెళ్దామని గుడి దగ్గర నుంచి వచ్చేటప్పుడు మా బాబుకి భోజనం టికెట్లు ఇవ్వగా  భోజన సత్రం ఎక్కడో తెలుసుకుని అక్కడికి  వెళ్ళి స్వామి వారి దివ్య ప్రసాదం అన్నపూర్ణమ్మ తల్లి అందిస్తున్నట్లు కళ్ళకు అద్దుకుని  సంతోషంగా తిని ఆ ఆది దంపతుల దయ వలన మాకు కలిగిన దానిలో  కొంచెం విరాళ మిచ్చి అక్కడి నుండి రూం కి వెళ్ళి కాసేపు విశ్రాంతి తీసుకుని 2 గంటలకు ఇష్ట కామేశ్వరీ  అమ్మవారి దగ్గరకు వెళ్ళటానికి వాన్ దగ్గరకు వెళ్ళాము. 10 మంది వస్తేగాని వెళ్ళరంట. అప్పటికి 8 మంది అవగా ఇంకా ఇద్దరు కాసేపటికి వచ్చారు. వాన్ బయలుదేరి కాసేపటికి అడవిలోనికి ప్రవేశించింది. దారి అంతా ఎర్రని మట్టి రోడ్డు ఇరుకుగా  గతుకులు గా ఉండి, వాన్ ఎత్తు పల్లాల మీద వెళ్తుంటే మాకు ఊయల ఊగుతున్న విధమై బలేగా ఉంది ఈ ప్రయాణం అనుకున్నాము.  అలా ఒక గంట ప్రయాణం చేశాక వాన్  ఆగింది. అమ్మవారి దగ్గరకు వచ్చేశామనుకున్నాం  కానీ  అక్కడంతా రాళ్ళు ఎక్కువగా ఉన్నందు వలన వాన్ వెళ్ళదు నడచి వెళ్ళాలి అన్నారు. సరే అని దిగి నడక మొదలు పెట్టాము.  కొంచెం దూరం వెళ్ళేటప్పటికి చిన్న చిన్న గుడిసెలు కనిపించినవి. చూస్తూ వెళ్తుంటే కొండ రాళ్ళు పేర్చిన ఒక చిన్న సొరంగం కనిపించింది. ఆ సొరంగం లోనికి వెళ్తే అమ్మవారు ఉంటారని అక్కడున్నవారు చెప్పారు.  గుహ  దగ్గర కొంత మంది భక్తులు లోపలికి వెళ్ళి వస్తున్నారు. గుహ వెలుపల శివ లింగాలు, నందీశ్వరుడు ఉన్నాయి. గుహకి కొంచెం ఎడంగా  కాలువ ఉండి అందులో నీరు ప్రవహిస్తూ ఉంటే అక్కడికి వెళ్ళి కాళ్ళు, చేతులు కడుక్కుని వచ్చాము. ఈలోపు గుహ దగ్గర ఖాళీగా ఉంటే శివయ్యకి, నందీశ్వరునికి నమస్కరించుకుని  ఒకరి తర్వాత ఒకరుగా లోపలికి వెళ్ళాము.  అక్కడ అంతా చీకటిగా ఉండి, కళ్ళు చీకటికి అలవాటు పడినాక అమ్మవారి ప్రతిమ మనోహరంగా ఉండి, చూడగానే తన్మయత్వం కలిగి మనసు పులకించింది. అమ్మవారి నుదుటి వద్ద మనం బొట్టు పెట్టి నమస్కరించుకుంటే మంచిదని చెప్పారు. మేము అమ్మవారికి పూజ చేసుకుని నుదుట బొట్టుపెట్టి మనస్పూర్తిగా నమస్కరించుకుని సంతోషంగా ఒకరి తదుపరి ఒకరం బయటికి వచ్చికాసేపు అక్కడే కూర్చుని వాన్ ఉన్న చోటికి వచ్చి వాన్ లో అప్పటికే మిగతావారు  కూడా రావడంతో మేము కూర్చోగానే వాన్ లో  తిరుగు పయనం సాగింది. ఇలాంటి  ఊయల ఊగుతున్నట్లుగా  ఉండే ప్రయాణమంటే  చిన్న పిల్లలు బలే సరదా పడతారు  అనుకున్నాము. వస్తుంటే  గుహ  దగ్గరకు వెళ్ళే వాన్లు  4 , 5 ఎదురైనవి. ఒక గంట ప్రయాణం చేయగా వాన్ ఎక్కిన చోటుకి చేరుకున్నాం. అప్పటికి సాయంత్రం 4 అవటంతో రూం కి వెళ్ళి 5 గంటలకి
మల్లికార్జున స్వామి,  భ్రమరాంబికా అమ్మవార్లకు ప్రత్యేక పూజ చేసుకోవటానికి టికెట్ల కోసం బాబు ముందు వెళ్ళి టికెట్లు తీసుకుని మా కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. మేము వడి వడి గా వెళ్ళి పూజ చూసిన కాసేపటికి  మహా  హారతి తీసుకుని వరుసలో గర్భగుడి లోనికి వెళ్ళి, ఆ మహాదేవుని మనసారా చేతులతో తడుముకుని తల మోటించుకుని కళ్ళకద్దుకుని తన్మయత్వం తో  హృదయం ఉప్పొంగగా ఆ మల్లన్నతండ్రి మమ్ములను సదా చల్లగా చూడాలని  ఆ సదా శివుని కోరుకుంటూ  మనస్పూర్తిగా నమస్కరించుకుని  అక్కడినుంచి భ్రమరాంబిక అమ్మవారిదగ్గరకు వచ్చి ( క్రితం సారి వచ్చినపుడు అయ్యవారికి అభిషేకము, పూజ, అమ్మవారికి కుంకుమ పూజ  చేసుకున్న వివరములను మనసున తలచి ముదమునొంది) ఆ శివాని తల్లి చల్లని  చూపులు మాయందు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మనస్పూర్తిగా ఆ భవానీ మాతకు నమస్కరించుకుని వెలుపలికి వస్తూ ప్రసాదం
తీసుకుని దారిలో షణ్ముఖ స్వామి  ఎదురుగా శివలింగం అక్కడ పూజ చేసుకుని  నమస్కరించుకుని వెలుపలికి వచ్చి అకడ ఉన్న గంగా మాత ఇంకా శివలింగాలు చూసి అక్కడ పూజ చేసి  నమస్కరించుకుని  అక్కమహాదేవి గుహలకు ఎప్పుడు ఎలా వెళ్ళాలో తెలుసుకోగా మధ్యాహ్నం 12 లోపే టికెట్ బుక్ చేసుకోవాలంట.  చాలా దూరం బోటు లో ప్రయాణిస్తే ఆ గుహలు వస్తాయంట. ఇప్పుడు వీలుపడదనుకుని  లోగడ  వచ్చినప్పుడు బస్సు లో వెళ్ళి చూసిన సాక్షి గణపతి, ఫాలధార, పంచ ధార, ఆది శంకరా చార్యులు, హటకేశ్వరము, శిఖర దర్శనం అక్కడ  ఉన్న సహస్ర  శివ లింగాలు, లోపల  శివయ్య గుడి, ఆ గుడి లోనికి వెళ్ళి దర్శనం చేసుకుని అక్కడినుండి  శ్రీ శైలం డ్యాం చూడటం అవన్నీ మదిలో మెదిలాయి. ఆ అనుభూతులు నెమరువేసుకుందాము.  సాక్షి గణపతి గుడి లో వినాయక స్వామి చాలా మనోహరంగా ఉన్నారు. వెళ్ళిన వారు స్వామికి చెప్పుకోవాలంట మేము శ్రీ శైలం వచ్చి మల్లికార్జున స్వామిని దర్శించు కున్నాము అందుకు నీవే సాక్షి అని. గణపతి స్వామికి చెప్పుకుని నమస్కరించుకుని అక్కడినుంచి ఫాల ధార అంటే శివుని ఫాల భాగము నుండి ఉద్భవించిన పవిత్రమైన  నీరు. పంచ ధార  అనగా శివుని 5 ముఖముల నుండి వెలువడిన దివ్య జలము. అక్కడికి వెళ్ళాలంటే  ఆ ప్రదేశము చాలా  లోతులో ఉంటుంది..  పెద్ద పెద్ద మెట్లు దిగాలి  అలాగే మెల్లగా దిగుతూ  చూస్తుంటే  కనుచూపు మేర అంతటా పచ్చని చెట్లతో నిండి అద్భుతంగా ఉంది. నేను  అంత పెద్ద మెట్లు దిగలేక పోతుంటే మా  బాబు చేయి పట్టుకుని మెల్లగా నడిపించుకుంటూ చూడమ్మా ఈ అడవి లో ఇలాంటి అందమైన దృశ్యాలు ఉన్నాయో అని చెప్తూ ఫోటోలు తీస్తూ కాసేపటికి ఫాలధార, పంచ ధార ఉన్న ప్రాంతానికి  చేరుకున్నాము.  జగద్గురు  ఆది శంకరా చార్యులవారు ఇక్కడే తపస్సు చేసుకున్నారంట. అమ్మవారి ప్రతిమ శంకరాచర్యుల ప్రతిమలు  ఉన్నాయి  నమస్కరించుకుని   ఫాల ధార  పంచ ధార  ల వద్ద ఆ నీళ్ళు శిరస్సున చల్లుకుని కొంచెం త్రాగితే తీయగా చాలా బాగున్నాయి  అక్కడ ఎల్లప్పుడూ ఆ ధారలు అలా వస్తూనే ఉంటాయంటా. మంచినీళ్ళ డబ్బా లో ఆ నీళ్ళు  పట్టుకుని  కాసేపు అక్కడే ఉండి  అక్కడి సుందర దృశ్యాలను ఫోటో లో పొందు పరుస్తూ మెల్లగా మెట్లు ఎక్కుతూ పైకి చేరుకుని  అక్కడినుంచి హటకేశ్వరము చేరుకున్నాము. పూర్వము  కుమ్మరి కేశప్ప   అనే గొప్ప శివ భక్తుడు ఉండేవాడు  అతను రోజూ శివ నామస్మరణ చేస్తూ కుండలు చేసి వచ్చిన డబ్బులతో శ్రీ శైలం వచ్చే యాత్రీకులకు భోజన సదుపాయాలు కలుగ  చేస్తూ వారి ఆశీర్వాదం పొందుతూ ఉండేవాడు. అది చూసి తోటి కుమ్మరి వారు ఓర్వ లేక కేశప్ప జీవనాధారమైన కుండలు తయారు చేసే సారె ను తస్కరించగా  కేశప్ప  చేయునఆకూ ది లేక కొత్త సారెను తయారు చేసుకుని కుండలు చేయబోగా ఇంతలో నలుగురు సాధు పుంగవులు వచ్చి చాలా ఆకలిగా ఉంది త్వరగా భోజనము వడ్డించ వలసిందని కోరగా  తన వద్ద ఏమీ లేకపోవడంతో కేశప్ప  తనువు చాలించ తలపెట్టగా అంత  ఆర్త జన రక్షకు డైన  ఆ బోళాశంకరుడు కేశప్పకు కుండ పెంకు   లో దర్శన  మిచ్చి వరం కోరుకోమనగా   కేశప్ప ఆ మహాదేవునికి  తన్మయత్వం తో చేతులు జోడించి పాదాభివందనం చేసి నమస్కరించి స్వామీ నీవు ఎల్లప్పుడూ నా యందు ఉండి  నా వృత్తికీ అన్నదానమునకు లోటు లేకుండా చేయమని  కోరగా అటులనే అని ఆ దేవ దేవుడు అతనికి వరమొసంగి అక్కడే హటకేశ్వర స్వామిగా వెలిశారు. అటిక  అనగా కుండ పెంకు,ఉట్టి అనే అర్ధాలు వస్తాయి  కేశప్ప కు  కుండ పెంకు  లో దర్శనమిచ్చి అటికేశ్వర స్వామిగా  వెలసినందువలన  అటికేశ్వరము  గా ప్రసిద్ధి చెంది  కాల క్రమేణా  హటకేశ్వరము గా పిలువబడుతుంది. హటకేశ్వర స్వామి గుడికి దగ్గరలో కేశప్ప కుండలు చేయుటకు వాడిన మంచినీళ్ళ బావి కలదు.
అందులో ఎల్లప్పుడూ నీళ్ళు ఉంటూనే ఉంటాయంట. హటకేశ్వర స్వామి గుడికి   దగ్గరలోనే  గాయత్రీ అమ్మవారి గుడి కనిపిస్తూ ఉంటే అక్కడికి వెళ్ళి గాయత్రీ మాత మనోహర మైన రూపంతో అలరారుతూ చిరునవ్వులు
చిందిస్తున్నారు. ఆ తల్లికి మనసారా  నమస్కరించుకుని అక్కడినుంచి శిఖర దర్సనం కొరకు శిఖరేశ్వరము వద్దకు బస్సు  వెళ్తూ ఉంది. శిఖరేశ్వరము సమీపించి మెట్లు ఎక్కుతూ వెళ్ళి  అక్కడ ఒక  తిరగలి లాంటి రాతి ఫలకము పైన
నందీశ్వరుని  ప్రతిమ ఉంటుంది  ఆ నందీశ్వరుని కి నవ ధాన్యములు  సమర్పించి  శిరః భాగమున   చేయి వేసి మల్లికార్జున స్వామి ఆలయ శిఖరం  చూడాలి. అలా శిఖర దర్సనం చేయుట సమస్త పాప హరణం. మేము నందీశ్వరుని దగ్గరకు వెళ్ళి నవధాన్యములు సమర్పించి నమస్కరించి దూరాన గల మల్లికార్జున స్వామి గుడి శిఖరం
వైపు చూడగా  చాలా  గోపురాలు కనిపిస్తున్నాయి. అలానే చూసి నమస్కరించుకుని  మెట్లు దిగి కిందకు వచ్చి అక్కడ ఉన్న వీర శంకర స్వామి  గుడి లోపలికి వెళ్ళి ఆ స్వామికి ప్రక్కన ఉన్న అమ్మవారికి నమస్కరించుకుని  వెలుపలికి వచ్చి అక్కడ  శివయ్య, అమ్మవారు, సహస్ర శివ లింగాలు షణ్ముఖ స్వామి,  వినాయక స్వామి  అందరూ ఉండి కైలసమా అనిపించేటటువంటి  అద్భుత ప్రతిమలు  చూసి  నమస్కరించుకుని  కొన్ని ఫోటోలు దిగి కిందకు వచ్చి బస్సు ఎక్కాము. ఈసారి చూడబోయే ప్రదేశం శ్రీ శైలం డ్యాం. కొంచెం సేపు ప్రయాణం చేసి డ్యాం దగ్గరికి వచ్చి ఆగింది బస్సు. బస్సు దిగి డ్యాం  ఇంకా చుట్టూ పరిసరాలు చూస్తూ  ఉంటే  అక్కడి వాతావరణం చల్లగా ఉండి ఎంతో ఆహ్లాద కరంగా  ఉంది. మనసుకి చాలా ప్రశాంతంగా హాయిగా అనిపించింది.  డ్యాం  దగ్గర నీళ్ళు చాలా ఎత్తు నుండి  పెద్ద  శబ్దం చేస్తూ కిందకి పడుతూ ఉంటే  ఆ దృశ్యం చాలా అందంగా అపురూపంగా ఉంది. ఆ సుందర దృశ్యం చూస్తూ
ప్రశాంత వాతావరణానికి  కాసేపు అక్కడే ఉండి వచ్చి బస్సు లో కూర్చోగానే  బస్సు తిరుగు ప్రయాణం సాగించి ఎక్కిన  చోటికి వచ్చి ఆగింది. అక్కడినుంచి రూం కి వచ్చి భోజనం చేసి కొంచెం సేపు విశ్రాంతి తీసుకుని అన్నీ సర్దుకుని
రూం ఖాళీ చేసి స్వగృహమునకు  తిరుగు ప్రయాణం సాగించాము. శ్రీ శైల యాత్ర ఇంత సంతోషంగా జరిగేలా చేసిన
ఆ  శ్రీ శైల మల్లికార్జున స్వామికి  భ్రమరాంబిక అమ్మవారికి మనస్పూర్తిగా ధన్యవాదములు తెలుపుకుంటూ మరొక్కసారి  ఆ అర్ధనారీశ్వరులకు  మనసారా నమస్కరించుకుని గుంటూరు వెళ్ళే బస్సు ల వద్దకు వచ్చాము.
                                                           
                                                                   శుభం  భవతు


                                           శివ  శివేతి  శివేతి   శివే   తివ    భవ  భవేతి భవేతి భవే తివ
                                           హర  హరేతి హరేతి హరే  తివ   భజ  నమశ్శివ మేవ నిరంతరం
                                                               
                                                                   భజ నమశ్శివ మేవ నిరంతరం



















Monday, 5 December 2011

mahesvaram in madhyapradesh

                                                         
                                                        నమో  నమః శంకర  పార్వతీభ్యాం.
 ఓం కారేశ్వరంలో ఉదయం 9 :30 కి బస్సు ఎక్కితే మహేశ్వరం  వచ్చేసరికి  మధ్యాహ్నం  12 : 30 అయింది. బస్సు మేము మహేశ్వరం కోట వరకు రాకుండా  రహదారి పైన దించి వెళ్ళిపోయింది. అక్కడినించి  ఎటు వెళ్ళాలో, ఎంత దూరమో ఏమీ తెలీదు. దగ్గరే ఉన్న షాపు వాళ్ళను అడిగితే ఇక్కడినించి  రెండు కిలోమీటర్లు దూరంలో ఉంది మహేశ్వరం కోట, ఆటోలు  వెళ్తాయి అని చెప్పారు. మిట్ట మధ్యాహ్నం 1 అవుతుండడం తో  ఎండ విపరీతంగా ఉంది.. మార్చి నెల కూడా మూడు రోజుల్లో వెళ్ళబోతుంది  కదా ఎండ సహజమే. కానీ మధ్య ప్రదేశ్ లో ఎండా తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. రెండు పుచ్చకాయ ముక్కలు కొని, చల్లగా ఉంటుందని పెదాలకు రాసుకుంటూ కూర్చున్నాము. కాసేపటికి ఒక ఆటో వచ్చింది కానీ చాలా ఎక్కువ అడుగుతున్నాడనిపించింది. చూద్దామని  కొంచెం సేపు ఐస్ క్రీం తింటూ కూర్చున్నాము. అక్కడ ఐస్ క్రీం చాలా చౌక 5 రూపాయలకే  చాలా మంచివి ఉన్నాయి. చాలా బాగుంది ఐస్ క్రీం. తింటూ ఉండగానే ఆ ఒక్క ఆటోకూడా  వెళ్ళబోతుంటే ఇంక చేసేది లేక  ఎక్కి కూర్చున్నాము. కోటకు కొంచెం దూరం లో ఆటో ఆగగా దిగి, కొబ్బరికాయలు అమ్ముతున్న మామ్మ గారి వద్ద కొబ్బరి కాయలు కొని లగేజీ అక్కడే ఉంచి  ఉత్సాహంగా  కోట ముఖద్వారం గుండా లోనికి వెళ్ళాము.



అంత పెద్ద కోటని దగ్గరగా చూడటం అదే ప్రధమం. విశాలమైన ప్రాకారం. నాలుగు వైపులా చాలా పెద్ద  గోడలు. ఎలా కట్టారో అంత ఎత్తైన  పటిష్ఠ మైన రాజ ప్రాకారాలు.  చూస్తుంటే బలే అబ్బురమేసింది.  రాజ ప్రాసాదం లోపల ఒక పెద్ద  శివాలయం.  శివుడు రాజరాజేశ్వర నామంతో కొలువైయున్నాడు. రాణి ఆహిల్యాబాయి గొప్ప శివ భక్తురాలంట.  ఆమె నిత్య శివారాధనతో ఈ ఆలయంలో తరించేదట.  పుణ్య నర్మదా నది లోని మట్టితో శివ లింగం చేసి పూజించేదట. ఆ ఆలయం యొక్క శిల్ప కళా నైపుణ్యత ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు. గుడి ఆవరణలోనూ, బయట ఉన్నఅనేకమైన స్తంభాలు విశిష్టమైన సౌందర్యం కలిగియున్నాయి. ప్రతి రెండు స్తంభాలపై ఉన్న ఆకారాలు ఎంతో అందంగా ఉన్నాయి. గుడిలోనే కాదు, కోటలో అడుగడుగునా అపురూపమైన నిర్మాణ ప్రతిభ కనిపిస్తూ ఉంది. కోట ప్రాకారంలో ఉన్న ఖాళీలనుంచి నర్మదా నది కనిపిస్తూ ఉంటుంది. కోట నుంచి నర్మదా నది వైపు బయటికి వెళ్ళడానికి విశాలమైన మెట్లు. ఈ మెట్ల యొక్క ఆకారం కూడా ప్రత్యేకమే. ఇంత ప్రత్యేకత ఉండ బట్టే ఎన్నో సినిమా షూటింగ్లు జరుగుతాయి ఇక్కడ. సఖి సినిమాలోని స్నేహితుడా పాట ఇక్కడే తీశారు. నర్మదా నది ప్రక్కనే ఎన్నో చిన్న చిన్న శివ లింగాలు ఉన్నాయి. అలాగే చాలా  ఆలయాలు కూడా ఉన్నాయి. నర్మదా నదీమ తల్లికి నమస్కరించుకుని  కాళ్ళు కడుక్కుని ఒక గుడి లోపలికి వెళ్ళి ఆ  మహేశ్వరునికి, అమ్మవారికి, వెలుపల ఉన్న నందీశ్వరునికి నమస్కరించుకున్నాము. అక్కడ రాణి  అహిల్యాబాయి అర  చేతిలో శివలింగం పెట్టుకుని హృదయానికి హత్తుకుని  కూర్చున్న ఫోటో ఉంది. ఆమెను చూస్తుంటే రాణి లా లేదు. చాలా సామాన్యంగా, ప్రశాంతమైన  మోముతో భక్తి భావంతో  వెలుగుతూ ఉంది. ఆ ఊరిలో ఆమెను దేవత లా పూజిస్తారంట. ఆమెకు మనః స్మరామి.

ఆ కోటంతా చుట్టూ చూద్దామని వెనుకకు వెళ్ళగా కోటకు, గుళ్ళకు పైన మూలల్లో పెద్ద పెద్ద  తేనె తుట్టెలు ఉన్నాయి.  ఒళ్ళు జలదరించింది. ఎన్ని చూసినా ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి. ప్రభుత్వం వారు ఈ కళాత్మక, చారిత్రాత్మక ప్రదేశం యొక్క ఉద్ధరణకి కొంత శ్రద్ధ చూపిస్తే బాగుంటుందని అనిపించింది. మహేశ్వరం చేనేత  వస్త్రాల తయారీకి చాలా ప్రసుద్ధి. ఇక్కడి నేత వస్త్రాలు అసాధారణ ఖ్యాతి గాంచాయి. కోట లోపలే నేత తయారీ చేసే సంస్థలు ఉన్నాయి. ఒక  లాగా విశాల మైన ప్రదేశంలో ఉండి, అందులో ఆడవారు  మగ్గం  నేస్తున్నారు. చాలా మంది ఉద్యోగులు పని చేస్తున్నారు.  తయారైన చీరలు చూశాము. చాలా అందంగా పాఠశాల ఉన్నాయి. అప్పటికి మధ్యాహ్నం 2  అవుతుండడంతో ఆకలి  వేసి  నీరసం వచ్చింది. దగ్గరలో ఏదో చిన్న సత్రం లాంటిది ఉందని చెప్పగా  కోట నుండి వెలుపలికి వచ్చి అక్కడికి వెళ్ళాము. అక్కడ చాలా ప్రశాంతంగా మన ఇంటిలో ఉన్నట్లు ఉంది. కూర్చుంటానికి   పీటలు, ఎదురుగా తినటానికి విస్తర్లు వేశారు. టేప్ రికార్డు లో లింగాష్టకం వస్తుంది. బాలు గారు పాడిన ట్యూను కాకుండా మార్పుగా ఉన్నా కూడా వినసొంపుగా ఉంది.  మమ్మల్ని ఆ పీటల మీద కూర్చోమని  ఏమి కావాలి  అని హిందీలో అడిగారు. చావల్  అన్నాము. అంటే అన్నం కదా. వారు 2 రోటీలు, కొంచెం అన్నం, 4 రకాల కూరలు  విస్తర్లో వడ్డించారు. అన్నం మరీ కొంచెమే అవటం తో మళ్ళీ అడిగాము. వాళ్ళు చక్కగా వడ్డిస్తున్నారు. కాకపోతే అక్కడి వారు  అన్నం తినడం తక్కువ. రోటీలు  ఎక్కువ తింటారు కదా. వారిలో ఒకతను మేము అన్నమే తినటం చూసి  మీరు ఆంధ్రా వాళ్ళా అని అడిగితే  మాకు నవ్వు వచ్చింది.  కూరలు,రోటీలు కూడా బాగున్నాయి.  చాలా తృప్తిగా తిన్నాము. అన్నట్టు అక్కడి భోజనం కేవలం  25  రూపాయలే. ఇంత  చక్కగా ఇంటిలో  తిన్నట్లు ఉంటే అంత తక్కువ రేటుకే మంచి భోజనమా అని ఆశ్చర్యపడ్దాం. వడ్డించిన పిల్లవానికి ఇంకో పది రూపాయలు ఇచ్చి బైటికి వచ్చాము. లగేజి  పెట్టిన షాపు వద్ద లగేజి తీసుకుని ఆటోలు ఉన్నాయేమోనని  చూడగా ఒక్క ఆటో కూడా లేదు. ఇప్పుడేమీ  ఆటోలు  రావంట, బస్సుల దగ్గరికి వెళ్ళాలంటే  ఒక మైలుకి పైగా నడవాలి. మిట్ట మధ్యాహ్నం కావటం తో ఎండ విపరీతంగా ఉంది. ఇంక చేసేది లేక నేను ఒక బాగ్ భుజాన పెట్టుకుని. బాబు రెండు పెద్ద  బాగ్ లు, ఇంకో పెద్ద కవరు తీసుకుని ఎలాగో బస్సు దగ్గరికి చేరుకున్నాం. మహేశ్వరం యాత్ర సంతోషమయమైనందుకు ఆ మహేశ్వరునికి ధన్య వాదములు చెప్పుకుంటూ ఉజ్జయిని వెళ్ళే బస్సు కోసం ఎదురు చూస్తూ ఉన్నాము. తదుపరి ఉజ్జయిని యాత్రా విశేషాలు చెప్పుకుందాము.
                                                                శుభం భవతు.


mahakalesvara jyotirlingamu in ujjayini (madhya pradesh)

                                                 
                                  నమస్తే  నమస్తే  హర హర  మహాదేవ శంభో  శంకర   పార్వతీ  మనోహర
   
   మహాదేవుని ఆజ్ఞ లేకుండా ఏమీ జరుగదు కదా.. తమను దర్శించుకునే భాగ్యం  ఆ  జగజ్జననీ జనకులు మాకు కలిగించుట వలనే ఆంధ్ర నుండి వచ్చి మహారాష్ట్ర.. మధ్యప్రదేశ్  ల లోని జ్యోతిర్లింగాలు చూడగలుగుతున్నాము. మహేశ్వరం  నుండి ఉజ్జయిని  నేరుగా వెళ్ళే బస్సులు  ఖాళీ లేక  మధ్యలో ఇండోర్ అనే ఊరి లో  దిగి వెళ్ళవచ్చని చెప్పారు. అలానే  ఇండోర్ వరకు వాన్  లు వెల్తున్నాయని  అక్కడికి వెళ్ళి చూస్తే అందులో కూడా ఖాళీ లేదు.  అప్పటికే  చాలా  సమయం వేచియుండడం తో చేసేది లేక ఆ వాన్ లోనే ఎలాగో సర్దుకుని కూర్చున్నాము. చాలా ఇరుకుగా ఉండి కాళ్ళు నొప్పులు పెడుతున్నాయి. ఇద్దరికీ అంతే..ఏం చేస్తాంలే అనుకుని పరిసరాలు గమనిస్తూ ఇండోర్  ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాము. అలా ఎదురు చూడటం వలనేమో చాలా సమయం గడిచినట్లు అనిపిస్తుంది.  కాసేపటికి ఇండోర్ వచ్చిందన్నారు. హమ్మయ్య అనుకుంటూ లేవబోతుంటే కాళ్ళు పట్టేసినాయి  అలాగే మెల్లగా లేచి, ఉజ్జయిని వెళ్ళే బస్సు కోసం చూస్తుంటే కొంత సేపటికి బస్సు వచ్చింది  కానీ ఎంత సేపైనా బయలు దేరకుండా ఇంకా ప్రయాణీకుల కోసం చాలా సేపు అక్కడే ఉంది.అంతే కాక బస్సు లో టీవీ, అందులో
హిందీ సినిమా లు పెద్ద శబ్దం తో  పెట్టారు. చేసేది లేక కిటికీ లో నుంచి చూస్తూ  ఉంటే అక్కడ ఒక పెద్ద చెట్టుకి ఆకులు
లేక,  ఆ చెట్టునిండా  చిన్న చిన్న పిట్టలు  అవే ఆకులు లాగా గుంపుగా ఉండి  చూస్తుంటే  బలే ముచ్చటేసింది. మేము అలా చూస్తూ ఉండగానే బస్సు కదిలింది  అవంతీ నగరం వైపు.  ఒకప్పటి అవంతీ నగరమే ఇప్పటి ఉజ్జయిని కదా..బస్సు  కిటికీ లో నుండి ప్రకృతి అందాలు చూస్తూ ఉన్నాము. అక్కడి పంట పొలాలు పచ్చగా కళ కళ లాడుతున్నాయి. ఎటు చూసినా గోధుమ పంటే..పట్టుకుచ్చులాగా  బంగారపు  రంగులో ఉండి చాలా అందంగా ఉంది. రహదారికి  ప్రక్కన అక్కడక్కడ  పెద్ద పెద్ద చెట్లకి  ఆకులు లేకుండా కేవలం ఎర్రటి పూలే గుత్తులుగా ఉండి చూడ ముచ్చటగా ఉన్నాయి.. అవి  వేసవి కాలం లోనే పూస్తాయట. చూస్తూ ఉండగానే  అవంతి లోకి అడుగు పెట్టాము. అప్పటికి రాత్రి 8 :30 అవటంతో  త్వరగా దగ్గరలో ఉన్న హోటల్ లో రూం తీసుకుని  స్నానం  చేసి ఆటో   లో మహాకాళేశ్వర  స్వామి గుడికి  బయలుదేరాం. ఎక్కువ సేపు పట్టకుండా త్వరగానే వెళ్ళాము.. ప్రక్కన షాపు లో పూలూ..ప్రసాదాలు తీసుకుని త్వరగా  వెళ్ళి వరుసలో నుంచున్నాం. మెల్లగా వరుస జరుగుతూ ఆ స్వామి కి దగ్గరవుతూ ఉన్నాము. మాకైతే  చెప్పలేని ఆనందం..ఆత్రుత..చూడబోతున్నామని  ఆనందం..ఎప్పుడెప్పుడా అనే ఆత్రుత రెండూ మమేకమై మా మదిలో   అదొక  అనిర్వచనీయమైన  హర్షాతిరేకం  కలుగుతుంది.. వరుసలో ఉన్న టీవీ లలో ఆ స్వామి కి జరిగే అభిషేకం,  పూజ చేసుకోవటం  చూపిస్తున్నారు. దారిలో అక్కడ ఉన్న ప్రమిద లో దీపారాధన చేసి.. మెల్లగా నడుస్తూ..నడుస్తూ   ఆ  ఆది మధ్యాంత రహితుడు.. సృష్టి  స్థితి లయ కారకుడు  అయిన అమ్మహాదేవుని  పద సన్నిధికి చేరుకొని.. సంభ్రమం తో అలానే చూస్తూ..  స్వామి  పార్ధివ అలంకరణ తో సాక్షాత్తూ ఆ కైలాస వాసి వచ్చికన్నుల ముందు ప్రత్యక్ష మైనట్లుంది..  తన్మయత్వం తో..  ఎన్ని జన్మల పుణ్యమో కదా తండ్రీ  నీ దర్సన భాగ్యం లభించడం..అనుకుంటూ..  మనసారా ఆ మహాకాళేశ్వర  స్వామిని  తడుముకుని  తలమోటించుకుని  కళ్ళకు అద్దుకుని  నమస్కరించుకుని..  అలంకరించిన  పార్ధివము  కొంచెం తీసుకుని బొట్టుపెట్టుకుని..  ఇంకొంచెం భద్రపరుచుకుని .. మెల్లగా బయటికి వచ్చి  ఆటోలో  నుంచి  దిగుతుంటే ఆటో అతను చెప్పాడు..మీకు ఉజ్జయిని లోని మిగిలిన పుణ్య క్షేత్రాలను చూపించుతాను  200 రూపాయలకు అని.. ఎటూ మేమూ చూడాలను కుంటున్నాము కదా అని సరే  రేపు 6 :30 కి రమ్మని చెప్పి.. రూం కి వచ్చి భోజనం చేసి,  తెల్లారి అయ్యవారి దర్శనార్ధం  త్వరగా లేవాలని  కునుకు తీసేందుకు  సమాయత్తమయ్యాము. మరుసటి రోజు అనగా సోమవారము  28 /3 /2011 న ఉదయం 6 :30 కే రెడీ అయి ఆటోకోసం ఎదురు చూస్తూ ఉండగా కొంచెం సేపటికి  వచ్చింది ఆటో.. ఎక్కి కూర్చుని వెళ్ళవలసిన దేవాలయముల  పేర్లుగల లిస్టు ఆటో అతను ఇస్తే చూస్తూ.. వివరములు మా బాబు అడిగి తెలుసు కుంటున్నాడు. అన్నీ హిందీ లోనే..  బాబు హిందీ లో చక్కగా మాట్లాడటం చూసి ఆటో డ్రైవర్ ..మీరు ఆంధ్రా వారైనా హిందీ  బాగా  మాట్లాడుతున్నారు..మేము చాలా సార్లు ఆంధ్రా నుంచి వచ్చిన వాళ్ళకి హిందీ మాట్లాడటం కుదరక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము.. మీరు చక్కగా మాట్లాడుతుంటే  చాలా సంతోషంగా ఉంది అన్నాడు.
ముందుగా వినాయక స్వామిగుడికి వెళ్ళి దర్సనం చేసుకుని, అక్కడినుంచి  ఉజ్జయిని అమ్మ దగ్గరకు బయలుదేరాము. అక్కడి కాళీ మాతను ఉజ్జయిని అమ్మ అంటారు..అక్కడే కాళిదాసు అమ్మ కరుణా కటాక్షం పొంది
సకల విద్యా పారంగతుడై మహాకవి కాళిదాసైనాడు..దక్షిణాదిన  శ్రీశైలం లో శివయ్య  జ్యోతిర్లింగము, అమ్మ వారి శక్తి పీఠము  రెండూ ఒకేచోట  ఉన్నట్లుగా  ఉజ్జయినిలో  కుడా మహాకాళేశ్వర స్వామి జ్యోతిర్లింగము ,మహాకాళికా అమ్మ వారి శక్తి పీఠము రెండూ ఉజ్జయిని లోనే ఉండటం.. అలాంటి పుణ్య క్షేత్రాలని సందర్శించటం  దైవానుగ్రహం ఉంటేనే  సాధ్యమవుతుంది కదా అనుకుంటూ.. అదిగో ఉజ్జయిని అమ్మ దగ్గరకు వచ్చేశాం.. ఆటో దిగి గుడి లోనికి వెళ్తూ ప్రక్కనే  ఉన్న షాపు లో  పూలు, పళ్ళు ,ఎర్ర జాకెట్, ఎర్ర గాజులు   తీసుకుని గుడి చుట్టూ తిరిగి గుడి  లోపలికి వెళ్ళాము.. ఎక్కువ జనం లేక పోవటంతో  చాలా ప్రశాంతంగా ఉంది.. అమ్మవారు  ముగ్ధ మనోహరంగా.. అభయ హస్తం తో భక్తులను ఆశీర్వదిస్తూ చిరునవ్వులు చిందిస్తూ ఉంటే మా హృదయం అనిర్వచనీయమైన  ఆనందంతో  ఉప్పొంగింది..మనసారా..తనివి తీరా అమ్మను చూసుకుని పూజ చేసుకుని  చాలా సేపు అక్కడే కూర్చుని  ఆ తల్లి కి ప్రణమిల్లి.. నమస్కరించుకుని  ఆటో అతను వేచియున్నాడు కదా  అనుకుని  వచ్చి ఆటో ఎక్కి కూర్చోగానే  డ్రైవర్  చెప్పాడు ఈసారి  మంగళ నాధ్ స్వామి గుడికి అని..కాసేపటికి వచ్చాము.. అక్కడ షాపులో ఎర్రని పూలు, చిన్న ఎర్రని వస్త్రము ప్రసాదాలు మొదలగునవి తీసుకుని  గుడి లోపలికి  వెళ్ళి  అక్కడ నలుగురు పూజ చేసుకుంటూ ఉంటే కొంచెం సేపు ఆగి లోపల స్వామిని చూస్తూ ఉన్నాము. అక్కడా శివ లింగమే..  అంటే మంగళ నాధుడు  శివుని కుమారుడు కదా..ఉజ్జయిని  మంగళ నాధుని జన్మ స్థలమంట. ప్రత్యేకంగా ఆ స్వామికి గుడి కూడా ఉజ్జయిని లోనే ఉన్నదంట..స్వామి  శివ లింగ రూపం లోనే ఉండి భక్తులను ఆశీర్వదిస్తూ ఉంటారన్నమాట. లోపలి వాళ్ళు వచ్చేయగా మేము లోపలికి వెళ్ళి  స్వామి ప్రక్కనే కూర్చుని వెంట ఉన్న పూలు,  ప్రసాదాలు సమర్పించి పూజ చేసుకుని  నమస్కరించుకుని వచ్చి ఆటోలో మళ్ళీ పయనం సాగించాం. ఈ పర్యాయము  కాల భైరవ స్వామి గుడికి.. పది నిమిషాల్లో చేరుకొని  ఆటో దిగి షాపులో స్వామికి పూలు, దారాలు  ప్రసాదం..మద్యం సీసా.. స్వామికి పోస్తా రంట ఒకటి తీసుకుని గుడి లోపలికి వెళ్ళాము. లోపల కొంతమంది స్వామికి పూలు పళ్ళతో పాటు  మద్యం పూజారికి ఇవ్వగా..పూజారి  స్వామికి నోట్లో  కొంచెం పోసి కొంచెం ప్రసాదంగా  ఇస్తున్నారు. మేము తీసుకెళ్ళిన  పూలు పళ్ళు మద్యం  స్వామికి సమర్పించి నమస్కరించుకుని వెలుపలికి  వచ్చి ప్రక్కనే ఉన్న దత్తాత్రేయ స్వామి గుడి లోనికి వెళ్ళి స్వామికి నమస్కరించుకుని వచ్చి ఆటో లో పర్యటన కొనసాగించాము..  మనం చిన్నప్పుడు చదువుకున్న చందమామ కధల కధా నాయకుడు విక్రమార్కుడు అవంతీ నగర వాసియే కదా.. అతను  కొలువుతీరిఉన్న అతని ప్రతిమ, ప్రక్కన చాలా చిన్న చిన్న బొమ్మలు..దగ్గరికి వెళ్ళి చూసి  వచ్చి ఆటోలో  కులదేవతా శక్తి పీఠము ఉన్నదని ఆటో అతను అక్కడకు తీసుకెళ్ళగా  దిగి అమ్మ వారికి పూలు  ప్రసాదం తీసుకుని గుడి లోనికి వెళ్ళి  ప్రసన్నమైన  ఆ ఆదిపరాశక్తి  అమ్మ ను  కన్నులారా వీక్షించి నమస్కరించుకుని  వచ్చి ఆటోలో కూర్చున్నాము.ఆటో అతను ఉజ్జయిని లో ప్రవహించే క్షిప్రా నది దగ్గర రామ్ ఘాట్ అంటారంట అక్కడికి తీసుకెళ్ళాడు..ఆటో దిగి క్షిప్రా నదీమ తల్లి దగ్గర కాళ్ళు కడుక్కుని  వచ్చి ఆటోలో కూర్చోగానే.. మహాకాళేశ్వర  స్వామి గుడి వద్ద దింపి అక్కడ దర్సనం ఆలస్యం గా అవుతుందని వెళ్ళాడు. మాకూ అదే మంచిదనిపించింది..ఎంత సేపైనా ఉండి ప్రశాంతంగా దర్శించుకోవచ్చు  అనుకుని అక్కడ ఉన్న క్షిప్రా నదీ కుండం లో కాళ్ళు కడుక్కుని,  స్వామికి పూలు, పళ్ళు దారాలు కొని వెళ్ళి వరుసలో నుంచున్నాము..అప్పటికి మధ్యహ్నం 12  దాటింది మేము ఏమీ తినలేదు..నీరసముతో వరుసలో చాలా సేపు నిలబడ లేక కూర్చున్నాము. కొంచెం సేపటికే  వరుస జరగటం మొదలైంది..హమ్మయ్య అనుకుంటూ లేచి ఆ మహాకాళేశ్వర  స్వామిని చూడబోతున్నామని  ఉరకలేసే ఉత్సాహంతో ముందుకు కదులుతూ..ఇంకొంచెం  జరుగుతూ..ఆ అదిగో ఆ దేవ దేవుడు..మహాదేవుని.. చరణ సన్నిధికి చేరుకొని..తన్మయత్వంతో ఆ మహాకాళేశ్వర లింగము  అంత దగ్గరగా చూస్తుంటే ఆనందంతో అలానే చూస్తూ.. ఆ స్వామిని చేతులతో తాకి, కళ్ళకు అద్దుకుని  పూలు, పళ్ళు సమర్పించి పూజ చేసుకుని  జన్మ ధన్యమైంది తండ్రీ నీ దర్సన భాగ్యంతో  అనుకుంటూ నమస్కరించుకుని  అక్కడి నుంచి రాలేక..రాలేక బయటికి  వచ్చి అక్కడ ఉన్న నందీశ్వరునికి  నమస్కరించుకుని  వెలుపలికి వచ్చి పైన ఓంకారేశ్వర స్వామి  గుడి లోనికి వెళ్ళి  (ఒక విశేష మేమిటంటే ఓం కారేశ్వరం లో అమరేశ్వర  స్వామికి పైన మహా కాళేశ్వర స్వామి ఉంటే ఇక్కడ  మహాకాళేశ్వర స్వామికి పైన ఓంకారేశ్వర  స్వామి ఉంటారు.) ఆ స్వామికి నమస్కరించుకుని..ప్రక్కన ఇంకా చాలా శివ లింగాలు చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయి..స్వప్నేశ్వర స్వామి దగ్గర పూజ చేసుకుని..ఓంకారేశ్వర స్వామి గుడి ప్రక్కన గల రాతి ఫలకము పైన ద్వాదశ జ్యోతిర్లింగాలు..ఊరి పేర్లు రాసి ఉన్నాయి. అక్కడే గుళ్ళో చాలా సేపు కూర్చుని, ఫోటోలు దిగి  ఓంకారేశ్వర  స్వామికి పైన ఒక శివాలయం ఉందంట..అక్కడ కేవలం నాగ పంచమి రోజు మాత్రమే తలుపులు తీస్తారంటా.. మిగిలిన రోజుల్లో తీయరంటా.. అందుకని అక్కడికి వెళ్ళలేదు..మా నానీ.. స్వామి ప్రసాదం టికెట్  తీసుకుంటానికి వెళ్ళగా.. అక్కడి వారు అన్నదానం టికెట్ ఇచ్చారు..అప్పుడు తెలిసింది గుడి లో అన్నదానం జరుగుతుందని.. ఆ మహా కాళేశ్వర  స్వామీ మహాకాళికా అమ్మ వార్ల అనుగ్రహం వలనే ఈ విధంగా అన్నదానం టికెట్ లభించిందనుకుని.. భోజన సత్రం..  గుడికి కొంచెం దూరం లో అని తెలుసుకుని ఆటోలో
అక్కడికి చేరుకున్నాము.  అప్పటికి కొందరు తింటూ ఉన్నారు..వారి ప్రక్కన టేబుల్ పైన ఎవరైనా వస్తారని విస్తర్లు పరచి ఉంచారు.. మేము వెళ్ళి అక్కడ కూర్చున్నాము. ఎదురుగా టీవీ లో గుడి లో మహాకాళేశ్వర  స్వామికి జరిగే
పూజాదికాలు  చూపిస్తున్నారు..వడ్డన మొదలైంది..అన్నం తో పాటుగా బేల్ పూరీ, పప్పు,ఇంకా 2 రకాల కూరలు,
పాయసం..ఇన్ని రకాలా.. అవి ఎంత బాగున్నాయో..సాక్షాత్తూ ఆ అన్నపూర్ణేశ్వరీ  దేవి వచ్చి వడ్డించినట్లు గా అనిపించింది. వారు మళ్ళీ  మళ్ళీ  కావాలా అని అడుగుతూ ఉంటే ఎంత ఓర్పుగా వడ్డన చేస్తున్నారు..అనుకుని
తృప్తిగా తిని.. తోచిన విరాళమిచ్చి  సంతోషంగా అక్కడినుంచి హోటల్ రూం కి  వచ్చాము. అప్పటికి సాయంత్రం 4 అవుతుంది.. ముంబయ్ కి 5 గంటలకు రైలు ఉంది..స్టేషన్..  రూం కి చాలా  దగ్గరేకదా అని కాసేపు విశ్రాంతి తీసుకుని లేచి  అన్నీ సర్దుకుని.. ఉజ్జయినీ యాత్ర శుభప్రదంగా  జరిగేటట్లు చేసిన ఆ మహాకాళేశ్వర  స్వామికీ  మహాకాళికా అమ్మ వారికీ మనస్పూర్తిగా ధన్యవాదములు  చెప్పుకుంటూ.. హోటల్ నుంచి రైల్వే  స్టేషన్ కి వచ్చి కూర్చున్నాము. 15 నిమిషాలకే రైలు వచ్చింది. సోమవారం సాయంత్రం 5 గంటలకు ఉజ్జయినిలో  రైలు  ఎక్కితే మరుసటి రోజు ఉదయం 5 : 30 కి గోరీవలీ లో దిగి  అక్కడి నుంచి సిటీ రైలు లో ముంబయ్ వచ్చి,  అక్కడి నుంచి ఆటోలో పవాయ్ లోని  మేముంటున్న ఇంటికి వెళ్ళేసరికి ఉదయం 6 : 30 అయినది. హే సర్వాంతర్యామి  మహేశ్వరా..ధన్యోస్మి తండ్రీ
అనుకుంటూ  విశ్రాంతి తీసుకున్నాము.

                              నమస్తే  నమస్తే మహాదేవ శంభో.. నమస్తే నమస్తే దయాపూర్ణ  సింధో..                                                          
                               నమస్తే  నమస్తే  ప్రపన్నాత్మ బంధో.. నమస్తే  నమస్తే నమస్తే  మహేశా..
                             
                                                                     శుభం భవతు.

Monday, 21 November 2011

amaresvara jyotirlingamu in om karesvaramu (madhya pradesh)

                                                                                               
                                                         ఓం  నమశ్శివాయైచ  నమ శ్శివాయ.

      ఓం కారే  అమరేశ్వరం. ఆంధ్రా నుంచి  మహారాష్ట్ర  వచ్చిన  అమ్మకు  వీలైనప్పుడల్లా దగ్గరలోని జ్యోతిర్లింగములను  దర్శించుకునే భాగ్యము కలిగించాలని  మా బాబు తాపత్రయం. అమ్మతో కలిసి ఆ అర్ధనారీశ్వరులను దర్శించుకోవటం  బాబుకి  బహు  మక్కువ. ఈసారి మధ్య ప్రదేశ్ లో ఉన్న ఓంకారే శ్వరం, అలాగే ఉజ్జయిని క్షేత్రాలని సందర్శిద్దామని అనుకున్నాం. మార్చి 25 రాత్రి ముంబయ్ లో 8 : 30 బయలుదేరి ఖాండ్వా  వరకు రైలు లో వెళ్ళి,  అక్కడి నుంచి  ఓం కారేశ్వరం వెళ్లేసరికి ఉదయం 11 : 30 అయినది. గుడికి దగ్గరలోనే ఒక హోటల్ లో రూం తీసుకున్నాము.  రెండో అంతస్తు లో ఉన్న రూం నుంచి చూస్తే ఓంకారేశ్వరస్వామి  గుడి, దూరంగా ఉన్న పెద్ద శివుని  ప్రతిమ చక్కగా కనిపిస్తున్నాయి.  కాసేపు  విశ్రాంతి తీసుకుని  కొంచెం అల్పాహారం తిని, 3 : 30 కి  గుడికి బయలుదేరాము. ఓంకారేశ్వరం చేరే ముందు నర్మదా నది రెండుగా చీలి ఆ స్వామి గుడి  చుట్టూ ప్రవహించి మళ్ళీ ఒక చోట కలుస్తుంది.  మేము నర్మదా నదీమ తల్లికి నమస్కరించి, ఓంకారేశ్వర ఘట్టం లో స్నానం చేసి గుడిలోనికి వెళ్ళాము.

గుడిలో ప్రవేశించడానికి ముందు అక్కడ ఉన్న వినాయక స్వామికి, నందీశ్వరునికి నమస్కరించి లోపలికి వెళ్ళాము. అద్భుతం, అమోఘం. అమరేశ్వర స్వామి ని చూట్టానికి రెండు కళ్ళు చాలవనిపించింది. శివయ్య వెనుకే అమ్మవారు చాలా మనోహరంగా ఉన్నారు. జ్యోతిర్లింగం ఓం ఆకారం లో ఉన్నట్లు  ఉంటుంది.  పూలు,ప్రసాదం ఆ  ఆది దంపతులకు సమర్పించి  కాసేపు అక్కడే కూర్చుని   మనసారా  ధ్యానించుకున్నాము. ఇక్కడ జ్యోతిర్లింగము తాకకూడదట, తాకటానికి  వీలు లేకుండా కడ్డీలు అడ్డం ఉన్నాయి. ఆ జగజ్జననీజనకులను కన్నులారా వీక్షించి  నమస్కరించుకుని  ఇంకా జనం వస్తూ ఉండడంతో   వచ్చిహాలులోకూర్చున్నాము. బాబు  అన్నాడు, మళ్ళీ వెళ్ళి వద్దామని. సరే అని ఒకరి తర్వాత ఒకరం వెళ్ళి వచ్చాము. పూజారులు  గుర్తు పట్టి ఎన్ని సార్లు వస్తారు అని అన్నారు (హిందీలో). అంటేలే  అని చక్కగా తనివి తీరా దర్శనం చేసుకుని నమస్కరించుకుని వచ్చి కూర్చున్నాము. పక్కనే నర్మదా నది  ప్రవహిస్తూ, నదికి ఆవలి వైపున ఉన్న పరిసరాలు కనిపిస్తూ చాలా సుందరంగా ఉంది దృశ్యం. అక్కడినుంచి ఉన్న మెట్ల ద్వారా పైకి వెళ్తే ఇంకొక శివలింగం (మహాకాళేశ్వర స్వామి), అమ్మవారు ఉన్నారు. ఆ పైన సన్నగా ఇంకొక మెట్ల దారి ఉంది. అందులోనించి వెళ్తుంటే ఒక గుహ లాగా చీకటిగా ఉంది. అలాగే వెళ్తే అక్కడ శివ లింగాలు, ఎటుచూసినా శివయ్యే.



ఓంకారేశ్వర క్షేత్రం లో విశేషం పరిక్రమ. ఓంకారేశ్వర ద్వీపం చుట్టూ నడుస్తూ, అక్కడ ఉన్న అనేక క్షేత్రాలను, ఆలయాలను దర్శించడం అన్నమాట. పరిక్రమ చేద్దామనుకుని సాయంత్రం 5 గంటలకు మొదలు పెట్టాము. 3 గంటలకు పైగా పడుతుంది అని చెప్పారు. అక్కడక్కడ చిన్నగుడిసెలు ఉన్నాయి. అప్పుడప్పుడు వాటిలో నివాసం ఉండే గ్రామస్తులు తారసపడుతున్నారు. దారిలో సింటెక్స్ ట్యాంక్లలో మంచినీళ్ళు అందుబాటులో ఉన్నాయి. .నర్మదా నీళ్ళే కదా, చాలా బాగున్నాయి. దారిలో ఉన్న దేవాలయాలు దర్శించుకుంటూ  వస్తున్నాము. ఎంతో పురాతనమైన ఆ ఆలయాలు ఈ క్షేత్రం యొక్క చరిత్రను స్ఫురణకు తెస్తున్నాయి. ఆ సాయంవేళలో అలా నర్మదా పరీవాహంలో నడుస్తుంటే నీరసమే తెలీలేదు. ఏదో కొత్త చైతన్యం పుట్టుకొచ్చింది. సాయంభానుని అనన్య శోభకి పరిసరాలన్నీ సిందూర  వర్ణం లో శోభిస్తున్నాయి. మునుపెన్నడూ చూడనంత సౌందర్యం నలువైపులా వెల్లివిరిసింది. కొంత సేపటికి పవిత్ర నర్మదా నదీ సంగమం చేరుకున్నాము. ఆహా ఎంత అద్భుతం, అంత దగ్గరగా ఆ సంగమం, ఆ జల పాత హోరు ప్రత్యక్షంగా చూస్తుంటే ఆ  ఆనందం  వర్ణనాతీతం. పరిక్రమ చేసే మార్గంలో శిలాఫలకముల పై భగవద్గీతా శ్లోకాలను భావసహితంగా చెక్కి ఉంచారు. ప్రాచీన కాలం నాటి  అపురూపమైన  గౌరీ సోమనాథ దేవాలయం చేరుకున్నాం. ఆ కళా నైపుణ్యం మహాద్భుతం. లోపల విశాలమైన, ఏంతో ఎత్తైన పెద్ద శివ లింగం. వెలుపల కూడా చాలా పెద్ద నందీశ్వరుడు. అప్పుడు సాయంత్రం 6 : 30 అయింది. ప్రదోష సమయం కదా. ఆ  నాట్య కళా సాకార  తాండవ శోభనామూర్తి  శివశంకరునికి మనస్పూర్తిగా పూజచేసుకుని, తృప్తిగా నమస్కరించుకుని  పయనం సాగించాము. వెళ్తూ ఉండగా, హోటల్ రూం నుంచి కనిపించిన అతి పెద్ద  మహాదేవుని  ప్రతిమని చేరుకున్నాము. ఆకాశమే ఆహార్యమై  అలరారు తున్నట్లు గా  మహోన్నతంగా  ఉంది. విగ్రహం కింద భాగంలో ఆలయం ఉంది. ప్రహరీ గోడ చుట్టూ  18  అమ్మవారి  శక్తి  ప్రతిమలు ఉండి ఎంతో శోభాయమానంగా   అలరారుతున్నాయి.  అడుగడునా  సుందర  దృశ్యాలను  బాబు తన కెమేరాలో పొందుపరుస్తున్నాడు. అప్పటికి  చీకటి పడుతుంది. లైట్లు కొంచెం దూరంగా ఉండడం తో సెల్ లో లైటు సహాయంతో, శివ నామ స్మరణతో నడుస్తూ ఉన్నాము. మెట్లు ఎక్కేటప్పుడు నాకు కొంచెం కష్టంగా  ఉంటే బాబు మెల్లగా చేయి పట్టుకుని తీసుకొస్తున్నాడు. ఆ..అదిగో గుడి కనిపిస్తుంది.. వచ్చేశాం. అవునా  మేమేనా  అంత దూరం నడిచింది. అంతా ఆ  అమరేశ్వరుని దయ. ఎలా నడుస్తామో అనుకున్న మాకు  కొంచెం కూడా అలసట కానీ, కాళ్ళు నొప్పులు కానీ తెలీలేదు. ధన్యోస్మి మహాదేవా అనుకుంటూ త్వరగా గుడిలోనికి  వెళ్ళి, మరలా దర్శనం చేసుకున్నాము.


 అమలేశ్వర జ్యోతిర్లింగం నుంచి విభజించబడి నర్మదా నదికి మరో ఒడ్డున వెలిసిన జ్యోతిర్లింగమే మామలేశ్వర లింగం.  అక్కడినించి  మామ లేశ్వర స్వామి గుడికి  వడి వడి గా బయలుదేరాము. రాత్రి 8 : 30 దాటడంతో తలుపులు  వేస్తారేమో అని చాలా వేగంగా వెళ్ళి గుడికి చేరుకున్నాము. ఆహా ఏమి మా అదృష్టం. మా మనః  పారవశ్యాన్ని వర్ణింపనలవి  కాదు. అక్కడ మామలేశ్వర స్వామికి  అభిషేకము, పూజ చేస్తున్నారు. పూజారి  చాలా వయో వృద్ధులు. కానీ  వృద్ధాప్యం వయసుకే గాని, మనో నిశ్చయానికి కాదు అన్నట్లు  వారు  ఎంతో  భక్తి భావన  తో  స్పష్టంగా మంత్రోచ్ఛారణ  చేస్తూ   స్వామికి అభిషేకము,  పూజ   చేస్తుంటే మా  మది  హర్షాతిరేకంతో పొంగిపోయింది. అక్కడ ఇంకా నలుగురు ఆడవారు కూర్చుని ఉన్నారు. మేము ప్రక్కన  పూజ చూస్తూ కూర్చున్నాము. హారతి తీసుకుని మహాదేవునికి, అమ్మవారికి నమస్కరించుకుని  తృప్తిగా అక్కడినించి కదిలాము. వస్తూ గుడి ఆవరణ లోనే ఉన్న శివాలయాలు  సందర్శించి  రూం కి వెళ్ళేసరికి రాత్రి  9 : 30 అయింది. దగ్గరలో ఉన్న హోటల్ కి వెళ్ళి ఆలూ పరాటా, పన్నీర్  పరాటా కొంచెం అన్నం తో భోజనం చేసి రూం కి వెళ్ళి ఉదయం త్వరగాలేచి  శివయ్యని  చూడాలి అనుకుంటూ నిద్రకు ఉపక్రమించాము.

తెల్లవారు ఝాము 4 : 30 కి లేచి 5 గంటలకు పవిత్ర నర్మదా నది లో స్నానం చేసి  మామ లేశ్వర స్వామి  సన్నిధికి వెళ్ళాము. అప్పటికే స్వామికి అభిషేకం చేస్తున్నారు. కొంచెం సేపు కూర్చుని హారతి తీసుకుని లోపలికి వెళ్ళాము. ఆ దేవ దేవుని  తన్మయత్వం తో  అలా చూస్తూ ప్రక్కనే  కూర్చుని  పూజా ద్రవ్యాలతో  పూజారుల సహకారం తో అభిషేకం, పూజ చేసుకుని  తనివి తీరా నమస్కరించుకున్నాము. ఓంకారేశ్వర స్వామిని తాకటానికి వీలు లేదనేమో, మామలేశ్వర  స్వామిని తాకి, ఇంత తృప్తిగా సేవించుకోడానికి ఇక్కడ జ్యోతిర్లింగముగా  వెలిశారు. అక్కడినించి  మళ్ళీ ఓంకారేశ్వర స్వామి గుడి కి  వెళ్ళి మాతా పితలకు మనసారా మ్రొక్కి వచ్చాము. ఉదయం 9 : 30 కు  మహేశ్వరం  వెళ్ళే బస్సు  ఉండడం తో  ఓంకారేశ్వర  జ్యోతిర్లింగ  యాత్ర  ఇంత మహత్తరంగా జరిగేటట్లు చేసిన  ఆ  సర్వేశ్వరునికి మనసులోనే  ధన్యోస్మి  ఓం కారే అమరేశ్వరం మామలేశ్వరం. ఓం నమః శివాయ  హర  హర  మహాదేవ  అనుకుంటూ మహేశ్వరం  వెళ్ళటానికి  బస్సు దగ్గరకు వెళ్ళాము. తదుపరి  మహేశ్వర  యాత్రా  విశేషాలు చెప్పుకుందాము.
                                                        సర్వేజనా  సుఖినో  భవంతు.

     

bheema sankara jyotirlingamu in maharashtra




                                                        
ఓం  నమః శివాయ
                       నాకూ, మా బాబుకి శివ సుక్షేత్రాలు దర్శించడమంటే ఎంతో ఇష్టం. అత్యంత ప్రాముఖ్యం కలిగిన పన్నెండు జ్యోతిర్లింగ క్షేత్రాలలో పూణేకి దగ్గరలో ఉన్న భీమశంకర ధామం ఒకటి. ఆ శంకరుని అనుగ్రహం చేత ఒక వారాంతం అక్కడికి వెళ్దామని అనుకున్నాం. 11 / 2 / 2011  న  ముంబయ్ నుంచి భీమ శంకరం వెళ్ళడానికి MSRTC  బస్సు టికెట్ బుక్ చేశాము. ఘాట్కోపర్ లో రావలసినదానికన్నా ఒక గంట ఆలస్యంగా వచ్చింది బస్సు. కొంత దూరం పోయాక, బస్సు కిటికీ లో నుంచి చూస్తే, ప్రకృతి ఎంతో రమణీయంగా ఉంది. ఆ సౌందర్యాన్ని వీక్షిస్తూ మురిసిపోయాము. ఆహా ఏమి సోయగం! ఎటు చూసినా పచ్చదనం, చిన్న చెట్లకే  కాయలుకాసినవి. మామిడి చెట్లు అటు చాలా ఎక్కువగా ఉన్నాయి. చాలా లేతగా, చిన్నగా ఉన్నా కూడా వాటికి నిండుగా పూత పూసి, ఎంత అందంగా ఉన్నాయో. అలాగే జామ చెట్లు కూడా అంతే. పంట పొలాలు అయితే  పచ్చని  ప్రకృతి  ఆకృతి  పార్వతి కాగా అన్నట్లు సస్య శ్యామలంగా అలరారుతూ ఉన్నాయి.
మేము అనుకున్నదాని కన్నా చాల ఎక్కువ సేపు పట్టింది భీమశంకరం చేరుకునే సరికి. దాదాపు రాత్రి 8 గంటలు అయింది. మేము వెళ్ళే సరికి గుడి తలుపులు వేసేస్తారేమోనని  త్వరగా బయలుదేరాము. బస్సు దిగిన దగ్గర నుంచి, గుడి దగ్గరకు వెళ్ళటానికి అరగంట పట్టింది. పెద్ద పెద్ద మెట్లు, కొండలు తొలిచి వేశారు. సాధారణంగా గుడికి వెళ్ళడానికి మెట్లు ఎక్కాల్సి వస్తుంది. కానీ ఇక్కడ విచిత్రం ఏమంటే, గుడికి వెళ్ళడానికి మెట్లు దిగి వెళ్ళాలి. పరుగు లాంటి నడకతో గుడి దగ్గరకు చేరుకున్నాము. గుడి పక్కనే ఉన్న దుకాణం లో పూలు, కాయలు  తీసుకుని, పక్కనే ఉన్న కుండం లో కాళ్ళు కడుక్కుని  లోపలికి వెళ్ళాము. అక్కడ వాతావరణం ఎంతో ప్రశాంతంగా, నిజంగా దేవాలయం లాగా ఉంది. రణగొణ ధ్వనుల ఆచూకీయే లేదు. కనీసం జన సందోహాల కలకలాలు కూడా లేవు. అంతటి ప్రశస్తమైన ఆలయం ఇంత ప్రశాంతంగా ఉండడం ఆశ్చర్యంతో పాటు ఆసక్తిని, ఆనందాన్ని కలిగించింది. గర్భగుడిలో కేవలం నలుగురు ఆడ వారు, అర్చకులు ఉన్నారు. వారు అయ్యవారికి పూజ చేయించుకుంటున్నారు. మేమూ వెళ్ళి కూర్చున్నాము. అక్కడ గర్భగుడి లోకి వెళ్ళనిస్తారు. రాత్రి వేళ కావటం తో శివలింగానికి అలంకరణ తొడుగు పెట్టారు. పంచ ముఖాలతో అలరారుతూ ఎంత శోభాయమానంగా  ఉందంటే చెప్ప శక్యము కాదు. ఆ భీమేశ్వరుని చూస్తూ అలా తన్మయత్వం లో ఉండిపోయాము. ఈరాత్రికి దర్శనం అవుతుందో లేదో  అనుకున్న మేము ఇది అసలు ఊహించలేదు. కొన్ని ఆలయాలలో క్షణం పాటు దర్శనం కోసం గంటలు, రోజులు వేచియుండాల్సి వస్తున్నఈ రోజుల్లో, ఇంత ప్రశాంతంగా దగ్గరగా కూర్చుని పూజ చేసుకోవటం ఆ శివయ్యమాకు కల్గించిన అదృష్టమే కదా. ఎక్కువ జనం లేక పోవటంతో ఛాలా నెమ్మదిగా, ప్రశాంత చిత్తంతో పూజ చేసుకున్నాము. 

ఆ రాత్రి అక్కడే ఉండి, ఉదయం మళ్ళీ దర్శనం చేసుకుని వెళ్ళాలని మా ఆలోచన. గుడి దగ్గరలోనే రూం ఖాళీ ఉంటే తీసుకున్నాము. రూం కి వెళ్ళి, లగేజీ పెట్టి  అలా బయటికి వచ్చి వరండాలో నిలుచుంటే ఎదురుగా గుడి కన్పిస్తుంది. అలా చూస్తూ ఉంటే, ఆ అద్భుతమైన అనుభూతి ఎంతో మధురం. కానీ ఇంత దూరంలో కూడా కాకుండా, ఆ భీమ శంకరుని సన్నిధి లోనే ఉండగలిగితే బాగుంటుంది కదా అనిపించింది మా బాబుకి. గుడి ఆవరణలోనే  పడుకుంటే బాగుంటది కదా అన్నాడు బాబు. బలే ఆలోచన వచ్చిందే. ఆ శివయ్యని స్మరిస్తూ ఆయన నిలయంలో నిలవడం సుకృతమే కదా. విశాలంగా ఉన్న గుడి ఆవరణలో, గుడి లో పని చేసేవారు ఇద్దరు పడుకుని ఉన్నారు. మేము కూడా ఆ వైపు పడుకుంటాము అని వాళ్ళని అడిగాము. వాళ్ళు దానికి ఒప్పుకోలేదు, గుడికి సంబంధించిన వాళ్ళు తప్ప మిగిలిన వారు ప్రవేశించకూడదని అన్నారు. అయ్యో ఎలా అనుకుని కాసేపు అక్కడే ఉండి, మళ్ళీ ఒకసారి అడుగుదామనుకుని కొంచెం సేపే ఉండి వెళ్తాము అని చెప్పి ఎలాగో ఒప్పించాము. తర్వాత బాబు వాళ్ళ ద్వారా ఉదయం ఎప్పుడు తలుపులు తీస్తారో,  ఏవేళ అభిషేకం, పూజ చేస్తారో వివరాలు  అడిగి తెలుసుకున్నాడు. తెల్లవారు ఝామున 5  లోపే  అభిషేకం చేయించుకోవాలంట. ఆ తరువాత  శివ లింగం పైన పంచ ముఖాల తొడుగు పెట్టేస్తారంట. ఇంక మేము 2 గంటలు పడుకుని లేచాము  రూం కి వెళ్ళటానికి. చాలా సంతృప్తిగా అనిపించింది.


తెల్లవారుఝామున  4 గంటలకు మెలకువ వచ్చింది. అయిదు గంటల లోపే వెళ్ళాలి కదా ఎలా అనుకుని త్వరగా తయారయ్యాము. 5 గంటలు  కావస్తుంది. అప్పటికి ఇంకా పూజ సగమే అయింది. హమ్మయ్య అయిపోలేదు కదా అనుకుని హారతి ఇచ్చిందాకా బయటే ఉండి, హారతి తీసుకున్నాము. లోపలికి వెళ్ళవచ్చో  లేదో అనుకుంటూ ఉండగా  పూజారులే రమ్మని పిలిచారు. వెళ్ళి శివయ్యకి దగ్గరగా కూర్చున్నాము. ఎంత సంతోషమేసిందంటే  అసలు సాక్షాత్తూ అర్ధనారీశ్వరులే  కళ్ళ ముందు ప్రత్యక్ష మైనారా అన్పించింది. అక్కడ  శివ లింగం మధ్య లో పాపిటిలా ఉండి, రెండు లింగాల సంగమంలా ఉంటుంది. శివ పార్వతులు గా భావిస్తారు. శివలింగం యొక్క పానపట్టం లో ఉన్న చిన్న గుంట నుండి ఎప్పుడూ నీరు వస్తూ ఉంటుంది. ఆ నీరే భీమా నది. ఆ మహిమాన్విత శివ లింగం భీమేశ్వర జ్యోతిర్లింగం. పార్వతి అమ్మవారితో కలిసి వసించే అర్ధనారీశ్వరుడు, గంగా రూపిణి అయిన భీమాదేవిచే అనునిత్యం అభిషేకించబడే గంగాధరుడు. ప్రక్కనే కూర్చుని అభిషేకం, పూజ చేసుకున్నాము. గర్భాలయంలో ఉన్న అమ్మవారికి కూడా నమస్కరించుకుని, ఇంకా కొంత మంది పూజ చేసుకుంటుంటే చూస్తూ అక్కడే కూర్చున్నాము. ఎంత సేపు తాకి, నమస్కరించినా పూజారులు ఏమీ అనటం లేదు. తనివి తీరా మోటిచ్చుకుని నమస్కరించుకున్నాము. నిజంగా జన్మ ధన్యమయిందని చెప్పాలి. రాత్రి, ఇప్పుడు అలా దగ్గరే కూర్చుని పూజ చూసుకోవటం ఏ తపః ఫలమో. రాలేక రాలేక బయటికి వచ్చాము. అప్పుడు చూశాము అచ్చటి  ప్రకృతి శోభని.  చుట్టూ కొండశ్రేణులు, వాటి పైన దట్టంగా పచ్చని చెట్లమధ్యలో భీమశంకర  స్వామి గుడి. ఆ గౌరీశుడు  ఈ గిరుల  అందానికి  ముగ్ధుడై  ఇక్కడ  వెలశాడేమోఅనిపించింది.

గుడి దగ్గరనుంచి వచ్చి, రూం ఖాళీ చేసి  ఇల్లు కల వాళ్ళకు తాళం ఇవ్వటానికి  చూస్తే ఆ మామ్మ గారు లేరు. ఎక్కడికి వెళ్ళిందో తెలీదు. కూర్చోండి వస్తుందని వాళ్ళ అబ్బాయి చెప్పాడు. అది చిన్న హోటల్ లాంటిది. వడా పావ్ అని  అక్కడ ఎక్కువగా తింటారు. అప్పటికి ఉదయం 9 దాటిందనుకుంటా ఆకలి మొదలైంది. ఏదో ఒకటిలే అని ఒక వడా  పావ్  తెప్పించుకుని తిన్నాము. ఏమిటి ఈ మామ్మ ఎక్కడికి వెళ్ళిందో ఇంకా రాదేమి అనుకుంటున్నాము. రూం అద్దె  డబ్బులు కుడా  ఇవ్వాలి కదా. ఇంతలో కాళ్ళకు చెప్పులు, స్వెట్టర్ వేసుకుని కళ్ళద్దాలు పెట్టుకుని చాలా ఎత్తైన కొండ మీద నుంచి కర్ర పట్టుకుని  చేతిలో ఏవో పట్టుకొని, టక టక నడుచుకుంటూ వస్తుంది ముసలమ్మ. అహా ఈవిడా ముసలమ్మా. కానే కాదు. ఈ వయసులో పొద్దున్నే కొండ ఎక్కిదిగి వస్తుందంటే ఎంత ఓపికా. చూట్టానికి చాలా సన్నగా ఉంది. ఆమెను ఈ కాలం వాళ్ళ మనుషులతో పోల్చనే లేము. రూం అద్దె టిఫిన్ డబ్బులు కలిపి ఇచ్చాము. వస్తూ మరో సారి భీమ శంకర స్వామికి నమస్కరించుకుని బయటికి వచ్చేమెట్లు ఎక్కుతూ పక్కన ఉన్న షాపుల్లో ఏమి ఉన్నాయో చూస్తున్నాము. అయినా రాత్రి రుద్రాక్ష లు కొని శివయ్యదగ్గర ఉంచి పూజ చేసుకున్నాముగా. ఇంకా ఉదయం ఏమి ఉన్నాయో నని చూస్తుంటే శంఖువులు బాగున్నాయి. ఒక శంఖువు కొన్నాము. ఇంకా ముచ్చటగా ఉన్న నాలుగు చిన్న చిన్న శివయ్య ఫోటోలు  తీసుకున్నాము. అక్కడ పాలకోవా లాంటి స్వీట్ ఒకటి పెద్ద కళాయి లో చేస్తున్నారు. వాసన చూస్తుంటే తినాలని పించి కొంచెం తీసుకున్నాము. మెట్లు ఎక్కలేక ఎక్కుతున్నాను.  చాలా పెద్దవి, బాబు చెయ్యి పట్టుకుని మెల్లగా రామ్మా అని అంటున్నాడు. ఇంతలో ఒక షాపు వద్ద పొట్టిగా, సన్నగా ఉన్న చాలా ముసలావిడ వడా పావ్.. వడా పావ్ అని కేక లేస్తుంది. ఏమిటి ఇక్కడ ఈ వయసులో కూడా ఇలా పని చేస్తున్నారు అని మాకు ఆశ్చర్యమేసింది. సరే  చూద్దాము. ఇంతగా మామ్మగారు రమ్మంటున్నారు కదా అని లోపలికి వెళ్ళాము. వెళ్ళగానే వేడి  వేడిగా  వడా పావ్ చేసి ఇచ్చింది. చాలా బాగుంది. ఇంకోటి కావాలా అంటే సరే అన్నాము. మేము అడుగుతామని ముందే ఊహించినట్లు, రెండు నిమిషాల్లో  చేసి ఇచ్చింది. బలే హుషారైన మామ్మ గారు అని నవ్వుకున్నాము. దారి మధ్యలో స్కూలు పిల్లలని తీసుకుని టీచర్లు గుడి దగ్గరకు వెళ్తున్నారు. చాలామంది పిల్లలు ఉన్నారు. ఇంకా పది మంది కుర్రాళ్ళు తెలుగు లో జోక్స్ వేసుకుంటూ వెళ్తున్నారు. నాకు తెలుగు వాళ్ళని చూస్తే సంతోషంగా ఉంటుంది. నానీ తెలుగు వాళ్ళు అంటూ మా బాబుకి చెప్పాను. దారిలో రాజరాజేశ్వరీ అమ్మవారి గుడి ఉంది. అమ్మవారు చాలా ప్రసన్నం గా కొలువై ఉన్నారు. దేవికి నమస్కరించుకుని బస్సు దగ్గరకు చేరుకున్నాము. అప్పటికి మధ్యాహ్నం 12 అయింది. మధ్యలో బస్సు ఆగినప్పుడు తిన్నాము. ముంబయ్ చేరేసరికి  రాత్రి 11  అయింది. భీమ శంకర యాత్ర ఇంత సంతోషంగా జరిగినందుకు  ఆ మహాదేవునికి మనసులోనే  ధన్యోస్మి అనుకుంటూ విశ్రాంతి తీసుకున్నాము. తదుపరి మధ్య ప్రదేశ్ లోని  ఉజ్జయిని, ఓంకారేశ్వరం మరియు మహేశ్వరం యాత్రా  విశేషాలు  చెప్పుకుందాము.
                                                                శుభం భవతు .

Sunday, 6 November 2011

trayambakesvara jyotirlingamu in maharashtra

                                                                      
ఓం నమః శివాయ సర్వం శివ మయo. నేను, మా బాబు నాని మొదటిగా బెంగుళూరు లోని బడా గణపతి మందిరం కు వెళ్ళాము. అక్కడ గణపతి విగ్రహం చాలా పెద్దగా దాదాపు 8 అడుగులు ఎత్తు గా కొలువు తీరి ఉంది. ఆ మహా గణపతికి మనసారా నమస్కరించుకుని, దగ్గర్లోనే ఉన్న బడా నంది విగ్రహం కూడా చూద్దామని వెళ్ళాము. అక్కడ నందీశ్వరుడు  కూడా చాలా పెద్దగా ఉన్నాడు. ఆ నంది పైన శివ పార్వతులు చూడ ముచ్చటగా కొలువుతీరి ఉన్నారు. 
మేము బెంగుళూరు నుంచి ముంబై చేరుకున్నాము. మా బాబు ఉద్యోగ రీత్యా ముంబైలో నివాసం ఉంటున్నాడు.

                       త్రయంబకం 

28 -1 - 2011 న ముంబై నుంచి మహారాష్ట్ర లోని త్రయంబకేశ్వర స్వామి గుడికి బయల్దేరాము. నాసిక్ వరకు రైలు లో ప్రయాణం చేశాము. అక్కడ నుంచి కొంత దూరం బస్సులో, ఆ తర్వాత ఆటోలో గంట వరకూ ప్రయాణించిన తర్వాత సోమేశ్వర స్వామి గుడికి చేరుకున్నాము. అది జనవరి నెల అయినా కూడా ఉదయం 10  గంటలకే ఎండ ఎక్కువగానే ఉన్నట్లుగా ఉంది. కానీ అక్కడ ఇరు వైపులా చెట్లు ఉండి , దానికి తోడు మాకు ఆ శివయ్యని చూడాలనే ఆత్రుత వలన ఎండే తెలీలేదు.

అదిగో వచ్చేశాం, ఆ మహాదేవుని సన్నిధికి చేరుకున్నాం.
అక్కడ సోమేశ్వర స్వామి గుడికి తూర్పుగా పుణ్య
గోదావరి నది ప్రవహిస్తూ ఉంది. ఆ పవిత్ర గోదావరిని సమీపించి, ఆమెకు ప్రణమిల్లి, ఆ పవిత్ర జలాన్ని శిరసున చల్లుకొని, కాళ్ళు చేతులు కడుక్కుని వచ్చాము.గోదావరి నీరు చాలా స్వచ్చంగా నిర్మలంగా ఉన్నాయి. అక్కడి వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. పక్కన పనస చెట్లు పెద్దవి,చిన్నవి కాయలు కూడా ఉన్నాయి.నేను అదే మొదటిగా ఆ చెట్లు చూడటం ,చాలా హ్యాపీగా ఉంది.మా బాబు ఐ .యస్ . ఐ (కలకత్తా ) లో చదివేటప్పుడు అక్కడ చాలా ఉన్నాయని చెప్పాడు. ఇంక గుడికి వెళ్ళాము. అక్కడ సోమేశ్వర స్వామి ధవళ వర్ణముతో లింగరూపంలో దేదీప్య మానంగా దర్సన మిస్తున్నట్లుంది చూట్టానికి రెండు కళ్ళు చాలవని పించింది .వర్ణించలేము చక్కగా మేమిద్దరం శివ లింగo ప్రక్కనే కుర్చుని స్వయంగా పూజ చేసుకున్నాము.మహారాష్ట్ర లో నాకు చాలా,చాలా నచ్చింది ఏమిటంటే మనమే గర్భ గుడి లోకి వెళ్ళి ,పూజ చేసుకోవటం. అక్కడ ఏ శివాలయం కి వెళ్ళినా, పూజారి బయట కూర్చుని ఉంటారు ,మనం లోపలికి వెళ్ళి, తాకి పూజ చేసుకోవచ్చు, ఎంత సేపు ఉన్నాఏమీ అనరు. గుడిలోకి మరాఠీ వాళ్ళు వచ్చి ,ధ్యానించుకుని వెళ్తున్నారు. మాకు అక్కడినుంచి కదలాలని ఉంటేగా. కానీ త్రయంబకం  వెళ్ళాలి కాబట్టి, ఆ  సోమేశ్వర మహాదేవునికి మరోసారి మనసారా నమస్కరించి, బయటికి వచ్చాము. ఆ ప్రశాంత వాతావరణం, ఆ సోమేశ్వర స్వామి దివ్య మంగళ రూపం మా మదిలో ఎప్పటికీ నిలిచితీరుతాయి.

అక్కడినించి త్రయంబకేశ్వరం బయలుదేరాం. బస్టాండ్ వరకు అటుగా వెళ్తున్న టాక్సీ మాట్లాడుకుని, త్రయంబకం వెళ్ళే బస్సు ల వద్దకు చేరుకున్నాము. ఆరోజు మరాఠీ వాళ్ళకు ఏదో విశేషమైన  పండుగట. ఏ బస్సు చూసినా విపరీతమైన రద్దీ. మేము ఆ జనం లో ఎక్క లేక రెండు బస్సులు ఎక్కకుండా  ఆగాము. అయినా ప్రతి ఒక్క బస్సు అలానే ఒత్తిడి గానే ఉంది. ఇంక ఎలాగో కష్టపడి, ఎక్కాము. కానీ నేను ముందు, మా బాబు చాలా చివర్న ఉన్నాము. ఎలా అక్కడేమో మరాఠీ,హిందీ నే మాట్లాడుతారు. నాకు హిందీ కొంచెమే వచ్చు. మా బాబు హిందీ,ఇంగ్లీష్ బాగా మాట్లాడుతాడు, బెంగాళీ కూడా తెల్సు .ఇప్పుడు చెరొక చోట ఉన్నాము. నాకన్నా ముందు బాబు కే కంగారుగా ఉంది, అమ్మ ఒక్కతే ఉంది, ఎలా అని. నేనేమో, నానీ ..నానీ అని పిలుస్తుంటే అందరూ నవ్వుతున్నారు. మొదట అర్ధం కాలేదు ఎందుకు నవ్వుతున్నారో తర్వాత వెలిగింది, హిందీ లో నానీ అంటే అమ్మమ్మ కదా అని. మాకూ నవ్వు వచ్చింది.  కొద్ది సేపటి తర్వాత ఎలాగో ఇద్దరం ఒకేచోటుకు వచ్చాము. బస్సు లో ఎవరో చెప్పారంట బాబు తో ఈరోజు దర్శనం అవుతుందో, లేదో అని. ఎటు చూసినా జనం. బస్సు లో నే కాదు, వాళ్ళు చాలాదూరం నుంచి, కాలినడకన, పాటలు పాడుకుంటూ, భజనలు చేసుకుంటూ,ఒక పల్లకి లో శివుని ప్రతిమ ఉంచి, ఆ పల్లకిని   తల మీద పెట్టుకు ప్రసాదాలు చేసుకుని, బస్సు రూటు లోనే త్రయంబకం వెళ్తున్నారు. ఆ జన ప్రవాహానికి బస్సు నెమ్మదిగా వెళ్తుంది, అప్పుడు, కిటికీ లో నుంచి మాకు ప్రసాదం పెట్టారు. మా మనసులో ఒకటే ధ్యాస. ఈరోజు దర్సనం అయితే బాగుండు నని. త్రయంబకం వచ్చేసింది. బస్సు దిగాము. గుడికి కొంచెం దూరం లో హోటల్ లో  రూం తీసుకున్నాము.దారిలో కొందరిని అడుగగా..వారు ఈరోజే దర్శనం కావడానికి అవకాశం ఉంది, రేపు అస్సలు గుడిలోకి వెళ్ళటానికి ఖాళీ ఉండదు అన్నారు.అప్పటికి సాయంత్రం 4 యింది. మేము రూం లో ఒక అర్ధ గంట రెస్ట్ తీసుకుని, బట్టలు,పూజ సామాగ్రి తీసుకుని. అక్కడి పుణ్య గౌతమీ  తటి లో స్నానం చేయడానికి బయలుదేరాము. మరాఠీ భక్తులు  పెద్ద, పెద్ద వంట సామగ్రి తో,లారీ లలో వచ్చి, ఆ రాత్రి  అక్కడి ఖాళీ ప్రదేశాలలో డేరాల్లంటివి  వేసుకుని, అందులో చిన్నా, పెద్దా అందరూ విశ్రాంతి తీసుకుంటున్నారు. మరుసటిరోజు వారంతా దర్శనం చేసుకుని, తెచ్చుకున్న సామగ్రి  లో  వంటచేసుకుని, తిని, తిరుగు ప్రయాణం చేస్తారనుకుంటా.

మేము త్వరగా స్నానం చేయుటకు గౌతమ మహర్షి శివునికి తపస్సు చేసి, శివుడు అనుగ్రహించగా ఏర్పడిన మహిమాన్విత  గౌతమీ తటి వద్దకు వెళ్లి, స్నానం చేసి, అక్కడ ఉన్న విఘ్నేశ్వరునికి నమస్కరించి, ప్రక్కనే ఉన్న
గంగా మాత కు ప్రణమిల్లి, వడి వడి గా  త్రిమూర్తి  స్వరూపు డైన  త్రయంకేశ్వర  స్వామిని  వీక్షించ డానికి అత్యంత
ఆత్రుత తో వెళ్తూ,  దారిలో పూలూ, ప్రసాదాలు కొని, వెళ్ళి క్యూ లో నుంచున్నాము. చాలా పెద్ద క్యూ ఉంది.
మేము క్యూ వైపు చూస్తూ చాలా సమయం పడుతుందనుకు oటూ అలా రెండు నిముషాలు నుంచున్నాము. ఇంతలో 4 ,5 గురు మా దగ్గరకు వచ్చారు.  వంద,  రెండు వందలు ఇస్తే డైరెక్ట్  గా లోపలికి వెళ్ళేటట్లు చేస్తామని అన్నారు. అంత మంది జనం క్యూ లో ఉండగా వీళ్ళు ఎలా తీసుకు వెళతారు.. అయినా క్యూ లో నుంచుని వెళితేనే భగవంతుని కోసం  మనం వేచి ఉన్నట్లు. అనుకుని, మేము వరుస లో నుంచున్నాము. అప్పటికి 5:30 దాటింది.ప్రదోష సమయం సమీపిస్తుంది. ఈశ్వరుడు తాండవ మాడే సమయం. ఆ సమయం లో దర్శనం జరగటం..  శివానుగ్రహమే  కదా. అనుకుని, పాటలు పాడుకుంటూ వరుస లో నుంచున్నాము.


ఎదురుగా ఆ త్ర్యంబకేశుడు కొలువు తీరియున్న గుడి, ధ్వజ స్తంభం, విశాలమైన కొండ శ్రేణులు. చిత్రకారుడు గీసినట్లు కొండలు వరుసగా ఎత్తు, పల్లం గా ఎంతో అందంగా ఉన్నాయి. అప్పుడే భానుడు తల్లి ఒడిలోకి కొండల  క్రిందుగా  దిగుతూ  వెళ్తున్నాడు. ఆ సంధ్యా కిరణాలు  గుడి  పైన, కొండల మీద పడ్తున్నాయి. ఆ దృశ్యం ఎంత మనోహరంగా ఉందో అది వర్ణనాతీతం. అద్భుతం, అమోఘం. అంత సుందర దృశ్యం తన కెమెరాలో బంధించకుండా ఉంటాడా మా బాబు.  ఆ వచ్చేస్తున్నాం.. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అయ్యవారి దర్శన భాగ్యం మరి కొద్ది క్షణాల్లో  కలగబోతుంది. లైన్ జరుగుతుంది..
మా మది లో అనిర్వచనీయమైన ఆనందం. ఎదురుగా టీవీ లో,  గుడిలో పూజాదికాలు చేయటం చూపిసున్నారు. అవి చూస్తూ వెళ్తున్నాము. మెల్లగా ధ్వజస్తంభం దాటాము. ఇంకొంచెం ముందుకు వెళ్తే ప్రక్కన వినాయకస్వామి, ఆ స్వామికి నమస్కరించి, ముందుకు కదిలాము. లోపలికి  వచ్చేశాం. కొంచెం అలా..అలా ముందుకు వెళ్తూ ఆ ఆది  దేవుడు, సృష్టి,స్థితి,లయ కారకుడైన త్రిమూర్తి రూపుని చూడాలని, చూపంతా అటే ఉంచాము.ఆ.. వచ్చేశాం.  ఎదురుగా ఒకే పానపట్టం లో ముమ్మూర్తులా మూడు శివ లింగాలు. తన్మయత్వం తో మది ఉప్పొంగగా, తనివితీరా ఆ మహాదేవునికి భక్తి పారవశ్యం తో నమస్కరించుకున్నాము.






అప్పటికి రాత్రి 8  30 కావటం వలన భోజనం చేద్దామని దగ్గరలోని హోటల్ కు వెళ్ళాము. ఆర్డర్ చెప్పిన కాసేపటికి కాసేపటికి భోజనం తీసుకువచ్చారు. కొంచెం వరి అన్నం, రెండు మైదా పిండి రోటీలు. పాలక్ పన్నీర్, ఆలూ కర్రీ ఇంకా గుర్తులేదు మొత్తానికి ఎలాగో తిన్నాము. అక్కడ రోటీలే ఎక్కువ. ఆంధ్రా వాళ్లకు వారు పెట్టే గుప్పెడు మెతుకులు పిల్లలకు కూడా చాలవు.హోటల్ నించి మేముండే హోటల్ రూం కి వెళ్ళాము. ఊటీ లో ఎంత చలో తెలీదు కానీ అక్కడ ఉన్న చలికి మాత్రం దుప్పట్లు, పరుపులు మంచు ముద్దల్లా ఉన్నాయి. చేతులు,కాళ్ళు చల్లగా మొద్దుబారి పోయాయి. అంత చలికి నిద్ర ఎలా పడ్తుంది. ఏదో కాసేపు అలా అలసిన శరీరానికి విశ్రాంతినిచ్చి, తెల్లవారుఝామున 4 గంటలకే లేచి,ఆ చలిలోనే బస్టాండ్ కి వెళ్ళాము. మరోసారి ఆ త్రయంబకేశ్వర  స్వామిని మనసులో స్మరించుకుని షిరిడీ వెళ్ళటానికి,షిరిడీ వెళ్ళే బస్సు ఎక్కాము. చలికి మా పెదాలు పగిలి మాట్లాడటానికి కూడా చాలా కష్టంగా ఉంది .షిరిడీ వెళ్ళి, అక్కడినించి శనీశ్వరుదు స్వయంగా వెలసిన శని సింగణాపూర్ వెళ్ళి అక్కడినించి ముంబయ్ వెళ్దాం  అనుకున్నాము. కానీ సమయం ఎక్కువ లేదు. షిరిడీ లో బస్సు దిగిన వెంటనే సామానులు, పూలు,కొబ్బరికాయలు కొన్నషాపు లో ఉంచి, బాబా దర్సనం కోసం బయల్దేరాము. జనం బాగా ఎక్కువే ఉన్నారు. అయినా పర్లేదు వరుస  చక్కగా కదులుతుంది.మేము చాలా వేగంగా నడుస్తూ వెళ్ళి, వరుసలో నుంచున్నాము.అక్కడ వాతావరణం చాలా  ప్రశాంతంగా ఉంది. అడుగడుగునా గాలి పంకాలు, మంచినీళ్ళు, కూర్చుంటానికి బల్లలు బారుగా ఉన్నాయి. ఎవరికీ ఏ ఇబ్బంది లేకుండా అన్ని వసతులూ ఉన్నాయి. అలా జరుగుతూ ఆ బాబాకి దగ్గరవుతూ ఉన్నాము. మాకు ముందు నుంచున్న వారిలో ఒక చిన్ని బాబు వాళ్ళ అమ్మ భుజం  ఫై ఉండి మా వైపు అలానే  చూస్తూ ఉన్నాడు. చాలా  ముద్దొస్తున్నాడు. ఆ బాబు అలా అమాయకంగా చూస్తుంటే నేను రమ్మన్నట్లు సైగ చేస్తూ నవ్వాను. బాబు మొదట అలానే చూసి, వేరొక వైపు తిరిగాడు. కొంచెం సేపటికి మళ్ళీ ఇటు తిరిగాడు. నేను మళ్ళీ అలానే చెయ్యి ఊపుతూ నవ్వాను. ఈసారి బాబు కుడా నవ్వాడు. నేను చూడమని మా నానీకి చెప్పాను. అలా మా ఇద్దరి వంక బుల్లి బాబు నవ్వుతూ చూస్తూ, మధ్యలో మేము కనిపించక పొతే వెతుక్కుంటున్నాడు. ఆ పసివాడిని చూస్తుంటే చాలా ముచ్చటేసింది. ఈ సందట్లో బాబా దగ్గరకు వచ్చేశాము. బాబా పాలరాతి విగ్రహం. ఒక కాలు మడిచి, ఇంకొకటి దానిపైన పెట్టుకుని  అభయ హస్తం తో చిరునవ్వు చిందిస్తూ  ఉన్నారు. శాంతి స్వరూపుడైన బాబా దర్శనంతో మనసు ప్రశాంతతని పొందింది. మనసారా నమస్కరించుకుని, తెచ్చిన పూలూ, ప్రసాదం సమర్పించుకుని వెలుపలికి వచ్చాము.

అక్కడినించి సింగ ణాపూర్ వెళ్ళే వాహనాలు ఎక్కువగా నిండిపోయి ఉన్నాయి. మేము కొంచెం ఆగితే ఉంటాయనుకుని చూస్తూ ఉండగా ఒక వాన్ లో ఖాళీ ఉంటే అందులో ఎక్కాము. సింగణాపూర్ లో ఒక విశేషముంది. ఏమంటే ఆ ఉరిలో ఇళ్లకు తలుపులు ఉండవు. మేము వాన్ లో వెళ్తూ చూశాము, ఇళ్ళకు, బళ్ళకే కాదు దుకాణాలకి కూడా తలుపులు లేవు. ఆ మహా శక్తివంతుడైన శనీశ్వరుడే వాళ్ళని, వాళ్ళ వస్తువులని కాపాడతాడని వారి నమ్మకం. వాన్ గుడికి కొంచెం దగ్గరలో ఆగింది. అక్కడ మగవారు మాత్రమే దగ్గరగా వెళ్ళి, నువ్వుల నూనె తో అభిషేకం చేసుకోవచ్చు. ఆడవారు కొంచెం ఎడం గా వేరే వరుస లో వెళ్ళి దండం పెట్టుకుంటారు. మా బాబు అలా స్నానం చేసి ఎర్రటి ధోవతి (అక్కడ కొనుక్కోవాలి లేదా పూజ సామాగ్రీ కొన్న దుకాణాల వాళ్ళు ఇస్తారు) కట్టుకుని, నువ్వుల నూనె తీసుకున్నాడు. నేను కూడా పూజ సామగ్రి తీసుకుని, చెరొక వరుస లో నుంచున్నాము. అక్కడ ఈశ్వరుని పేరు గల సూర్య పుత్రుదు, యమ సహోదరుడైన శనీశ్వరుడు గుడిలోపల కాకుండా, బయట కొలువు తీరియున్నాడు. ఎత్తుగా, కొంచెం ఏటవాలుగా నిగనిగలాడే ఒక నల్లని శిలా ఫలకం, ఆయనే స్వయంభువుడు, ఆశుభాపహారి అయిన శనీశ్వరుడు. తన్మయత్వం తో నమస్కరించుకున్నాము. మా బాబు నూనెతో అభిషేకించిన తర్వాత ధోవతి మార్చుకుని,  ప్రసాదం తీసుకుని, వచ్చి వాన్ లో కూర్చున్నాము. అప్పటికే మిగతా వాళ్ళు వచ్చేశారు.అక్కడి నించి వస్తూ ఉండగా మధ్యలో  తెలుగు వాళ్ళు వాన్ లో ఎక్కారు. వాళ్ళతో కాసేపు ముచ్చట్లు. మీది తెలుగు మాది తెలుగు లాగా. ఇక షిరిడీ లో దిగి, ముంబయ్ కి బుక్ చేసుకున్న బస్సు ఆగే దగ్గరకు వెళ్ళాము. అయిదు నిమిషాల్లో బస్సు వచ్చేసింది. అమ్మో కొంచెం ఆలస్య మైతే బస్సు వెళ్ళిపోయేది అనుకుని బస్సు ఎక్కాము. హమ్మయ్య భగవంతుని  దయతో మా పుణ్య యాత్ర సదా క్షేమంగా. శుభప్రదంగా జరిగినందుకు ఆ జగదీశ్వరుడు త్రయంబకేశ్వరునకు, శుభంకరుడు శనీశ్వరునికి, సద్గురు సాయినాథునికి మనసులో కృతఙ్ఞతలు తెలుపుకుని ధన్యోస్మి అనుకున్నాము. సంతోషంగా ఇద్దరం సీటు లో నిద్రకు ఉపక్రమించాం. రాత్రి 1 30  కి  క్షేమంగా ఇంటికి చేరుకున్నాము. తదుపరి భీమశంకర  యాత్రలోని విశేషాలు  చెప్పుకుందాము.
                                                        సర్వేజనా  సుఖినో  భవంతు.